ఇద్దరు చంద్రులు కలవరు;కొండమీద అమ్మోరు...కొండకింద కమ్మోరు:రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
విజయవాడ:తెలంగాణా ముఖ్యమంత్రి నేడు విజయవాడకు రానున్న నేపథ్యంలో ఆయన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తారా?...అనే అంశంపై తొలుత ఆసక్తి నెలకొంది. అయితే సిఎం చంద్రబాబు నేటి ఉదయాన్నే శ్రీకాకుళం పర్యటనకు బయలుదేరి వెళుతున్నట్లు తెలియడంతో ఆ ఉత్కంఠ వీడిపోయింది.
Recommended Video
దీంతో ఇద్దరు 'చంద్రులు' కలిసే అవకాశం లేదని తేలిపోయింది. తెలంగాణా సిఎం కెసిఆర్ విజయవాడకు మద్యాహ్నం 12 గంటలకు రానుండగా, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉదయం 9 గంటలకే శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయలుదేరి వెళతున్నారు. ఇదిలావుండగా తెలంగాణా సిఎం కెసిఆర్ విజయవాడ పయనంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కెసిఆర్...పర్యటన ఇలా
ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించనున్నారు. తెలంగాణ వస్తే బెజవాడ కనక దుర్గమ్మకు బంగారు ముక్కుపుడక సమర్పిస్తానని గతంలో మొక్కుకున్న కెసిఆర్ నేడు ఆ మొక్కును చెల్లించుకోనున్నారు. అందుకోసం గురువారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి శోభ, కుమార్తె కవిత, కోడలు, మనవడితో కలసి విజయవాడకు చేరుకుంటారు. 12 గంటలకు విజయవాడ చేరుకోనున్న ఆయన...గం. 12.45 నిమిషాల సమయంలో ఆలయానికి వెళ్లి మొక్కు తీర్చుకుంటారని తెలిసింది. అనంతరం తిరిగి హైదరాబాద్ కు పయనమవుతారు. తెలంగాణా దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి బుధవారమే కుటుంబ సమేతంగా విజయవాడకు బయలుదేరి వెళ్లారు.
సిఎం చంద్రబాబు...శ్రీకాకుళం పర్యటన
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 9.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 9.45 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 10.30 గంటలకు ఆమదాలవలస మండలం పార్వతీశంపేటలో హెలిప్యాడ్లో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆమదాలవలస మండలం రావికంటపేట గ్రామం వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ ‘ఏరువాక పౌర్ణమి'లో పాల్గొంటారు. 11.15 గంటలకు అక్కడి నుంచి జగ్గుశాస్త్రులపేటలోని ఎన్టీఆర్ గ్రీన్ఫీల్డ్ స్టేడియానికి చేరుకొని.. చంద్రన్న రైతు బీమా పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తిరుగుప్రయాణం అవుతారు.
ఇద్దరు చంద్రులు...కలవరు
ఎపి సిఎం చంద్రబాబు గురువారం ఉదయమే ఏరువాక కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయలుదేరి వెళుతున్నందున తెలంగాణా సిఎం కేసిఆర్ విజయవాడ చేరుకునే సమయానికి ఆయన అమరావతిలో ఉండరు. అందువల్ల ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. కాగా తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణా ఏర్పడ్డాక సిఎం హోదాలో అమరావతి ప్రాంతానికి రావడం ఇది మూడోసారి. 2015 లో అమరావతి శంఖుస్థాపనకు, ఆ తరువాత చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు, తాజాగా మూడోసారి ఇక్కడకు రానున్నారు.
కెసిఆర్ యాత్రపై...రేవంత్ రెడ్డి
తెలంగాణ సిఎం కేసీఆర్ విజయవాడ పర్యటనపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొండ మీద అమ్మోరు...కొండ కింద కమ్మోరుని ప్రసన్నం చేసుకోవడానికే కేసీఆర్ విజయవాడ వెళుతున్నారని విమర్శించారు. తెలంగాణాలో జూబ్లిహిల్స్ పెద్దమ్మ తల్లి, బల్కంపేట ఎల్లమ్మతల్లి, ఊరూరా పోచమ్మ తల్లులున్నారని...ఇక్కడ ఎవరికీ ఏమీ చేయించని కెసిఆర్ విజయవాడకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. అమ్మకు అన్నం పెట్టనోడు...పిన్నమ్మకు బంగారు గాజులు చేయించిన రీతిగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారన్నారు. నాలుగేళ్లుగా గుర్తుకు రాని ముక్కుపుడక ఇవాళే ఎందుకు గుర్తుకు వచ్చిందన్నారు. బెజవాడకు ఆర్భాటంగా వెళుతున్నది...ముందస్తు ఎన్నికలు వస్తున్న సందర్భంగా మాత్రమేనని దుయ్యబట్టారు. ఇదంతా కమ్మవాళ్లను ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్నారని, కేసీఆర్ ఈ పర్యటనతో తెలంగాణకు ఉపయోగమేమీ లేదన్నారు.