కేసీఆర్! నాగార్జున, అమల ల్యాండ్ మాటేమిటి?: ఏకేసిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత, శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన శనివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పిచ్చికుక్కలను కాపాడేందుకు అక్కినేని అమలకు చెందిన బ్లూక్రాస్ సంస్థకు బంజారాహిల్స్లో ఎకరాల కొద్దీ స్థలం ఇచ్చి, ఎర్రగడ్డ ఆసుపత్రులను అడవులకు పంపడం ఏమిటని రేవంత్ ప్రశ్నించారు.
పిచ్చికుక్కల కోసం నగరం బయట స్థలం ఇచ్చి, బంజారాహిల్స్ స్థలాన్ని పేదల ఆసుపత్రులకు ఇవ్వాలన్నారు. నాగార్జున చెరువును కబ్జా చేశారని, కానీ ఆయన వచ్చి ముఖ్యమంత్రిని కలవగానే ఆ చెరువు స్థలం స్వాధీనం చేసుకోకుండా వదిలేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే పత్రికలపై కేసులు పెట్టాలని కేసీఆర్ మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు సలహా ఇస్తున్నారన్నారు.
ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై తన సొంత పత్రికలో అడ్డగోలుగా రాశారన్నారు. రాజయ్యపై రాసినదానికి ఏం ఆధారాలు చూపించారని, ఆయన పత్రికపై ఎందుకు కేసు పెట్టలేదన్నారు. ఆంధ్రావాళ్ళ డబ్బులతో, ఆంధ్రావాళ్ళ కంపెనీ ప్రకటనలతో కేసీఆర్ పత్రిక నడుస్తోందని, మంత్రులతో సహా ఎవరిపై ఏ తప్పుడు రాతలు అందులో రాసినా ఎవరూ మాట్లాడటానికి వీలులేదన్నారు.
ఆ పత్రికలో కేసీఆర్ కుటుంబం ఫొటోలు, వార్తలు తప్ప ప్రతిపక్షం వారి వార్తలు ఏనాడూ కనిపించవని, సీఎం కేసీఆర్ ముందు తన పత్రికకు నీతులు చెప్పాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించకపోతే కోర్టులో కేసు వేస్తామని మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి తనకు చేసిన హెచ్చరికపై అడిగిన ప్రశ్నకు కూడా రేవంత్ స్పందించారు.
మంజీరా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై వార్తలు రాగానే 16 జేసీబీలు, 24 లారీలను ఆ జిల్లా కలెక్టర్ స్వాధీనం చేసుకొన్నారని, ఆరేడు ఇసుక లైసెన్సులను రద్దు చేశారని, తప్పుడువి కావడం వల్లే ఈ లైసెన్సులు రద్దు చేశారని, వాటిని ఇచ్చింది గనుల శాఖ మంత్రి హరీశ్ రావన్నారు. గనుల శాఖలో అక్రమాలు జరిగితే హరీశ్పై ఎందుకు చర్య తీసుకోరని ప్రశ్నించారు.
కలెక్టర్ తీసుకొన్న చర్యలతో అక్రమాలు రుజువయ్యాయని, ఇంకేం నిరూపణ కావాలన్నారు. రంగారెడ్డి జిల్లాలోని కాగ్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేయిస్తున్న మంత్రి, వరంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న నేతలు ఎవరో ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ఇసుక అక్రమాలపై ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయిస్తే అన్ని ఆధారాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
కోర్టుల్లో ప్రభుత్వం వేసే కేసులకు తాము భయపడబోమని, ఎన్నిసార్లు కోర్టుల్లో మొట్టికాయలు తిన్నామో ప్రభుత్వంలోని పెద్దలు లెక్కపెట్టుకొంటే మంచిదన్నారు. అసెంబ్లీ నుంచి నేను పారిపోయానని హరీశ్ రావు అంటున్నారని, విద్యుత్పై శ్వేత పత్రం ఇస్తామని, స్పీకర్ వద్ద వివరాలు పెడతామని ప్రకటించి పారిపోయింది ప్రభుత్వమే అన్నారు. హరీష్ రావు నిజాయితీ ఏమిటో నాగార్జున చెరువు వ్యవహారంలోనే తేలిందన్నారు.
ఆయన వచ్చి కేసీఆర్ కుటుంబ సభ్యులను కలవగానే చెరువు ఆక్రమణ గురించి మాట్లాడటం మానేశారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరంలో ఆక్రమణలకు గురైన చెరువుల గురించి పట్టించుకోడు గానీ, ఊళ్లలో చెరువుల పూడికలు తీస్తానని హరీశ్ కబుర్లు చెబుతారని, నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలను ఆపలేని ఈ పెద్ద మనిషికి మిచిగాన్ యూనివర్సిటీ పిలిచి దండేయబోతోందని పెద్ద ప్రచారం చేయించుకొంటున్నాడని ఎద్దేవా చేశారు.