బాబు పేరు చెప్పమని బెదిరింపు!: మత్తయ్య, రేవంత్ మలుపు తిరుగుతుందా?
హైదరాబాద్: తనకు ప్రాణహానీ ఉందని, రక్షణ కల్పించాలని ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడు అయిన జెరూసలేం మత్తయ్య ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రెండు, మూడు రోజుల నుండి తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్లు వస్తున్నాయని, బెదిరిస్తున్నారని చెప్పారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే అంతా చేయించారని స్టేట్మెంట్ రాయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని మత్తయ్య చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. చెప్పినట్లు చేస్తే తనకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారని, త్వరలో లొంగిపోతానని చెప్పారు.
రేవంత్ కేసు మలుపు తిరుగుతుందా?
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి వ్యవహారం మలుపులు తిరగనుందా అంటే కావొచ్చునని అంటున్నారు. ఈ వ్యవహారంలో కేసు ఎటువైపు వెళ్తుందోనని అందరూ ఆసక్తిగా ఉన్నారనే చెప్పవచ్చు.
రేవంత్ రెడ్డి అప్రూవర్గా మారుతారా? తెలుదేశం పార్టీకి, చంద్రబాబుకు మకిలి అంటించకుండా పార్టీకి రాజీనామా చేస్తారా? ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతిస్తే ఆయన ఏం చెబుతారా? రూ.50 లక్షల గురించి ఏం చెబుతారు? తదుపరి ఇస్తామన్న రూ.4.50 కోట్ల గురించి ఏం మాట్లాడుతారు? చంద్రబాబును విచారించే వరకు వస్తుందా?
దానిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.
మరోవైపు, టీడీపీ నేతలు కొత్త అంశాన్ని తీసుకు వచ్చారు. స్టింగ్ ఆపరేషన్ చెల్లదని గతంలో కోర్టు చెప్పిందని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో కేసులో ఏం జరుగుతుందోనని చర్చించుకుంటున్నారు.