ఎంతలో ఎంత మాట! ఓయు నాడు హీరో, నేడు సోయిలేనోళ్లా: కేసీఆర్ దులిపిన రేవంత్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం మహానాడు వేదికగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన దుమ్మెత్తి పోశారు. కేసీఆర్ను గద్దె దించే వరకు తమ పోరాటం ఆగదన్నారు.
కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారన్నారు. విద్యార్థుల ప్రాణత్యాగంతో తెలంగాణ వచ్చిందన్నారు. సీమాంధ్ర మిత్రులే కాదా.. తెలంగాణ కోసం పోరాడిన కళాకారులు గ్రామ గ్రామాన ఆడిపాడి కేసీఆర్ గురించి చెప్పాలన్నారు. కళాకారులు పల్లె పల్లెలో ఉద్యమాన్ని నిర్మించాలన్నారు.
తమకు ఏదో చేస్తాడని తెలంగాణ ను తెచ్చి దొర కేసీఆర్ చేతుల్లో పెట్టారని, కేసీఆర్ తెలంగాణ కుటుంబాలను బాగు చేస్తారని భావించారని కానీ అవన్నీ అడియాశలయ్యాయన్నారు. తెలంగాణ కోసం అరుణ తారలైన విద్యార్థులను అవగాహన లేని పోరగాళ్లు అంటూ అవమానించడం ఏమిటన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను అవగాహన లేని పోరగాళ్లు అంటుంటే నా కడుపు రగిలిపోతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఓయు విద్యార్థులు ఉవ్వెత్తున లేచినప్పుడు మీతోనే మేమంతా ఉన్నామని నాడు చెప్పాడని, ఇప్పుడేమో అవగాహన లేని పోరగాళ్లు అంటున్నారన్నారు.
ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ ప్రకటన విడుదల చేయలేదన్నాడు. గతంలో ఏ ఉద్యోగం అన్నా చంద్రబాబు అడ్డుపడుతున్నాడని చెప్పేవాడని, ఇప్పుడు ఏమయిందని ప్రశ్నించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశాడని, కేసీఆర్ ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు.
ప్రతి తెలంగాణ అమరవీరుల కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పాడని, తొలి ఉద్యమంలో పాల్గొన్న 369, మలి ఉద్యమంలో పాల్గొన్న 1200 మందికి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారని, కానీ ఇప్పటి వరకు ఎంతమంది అమరుల కుటుంబాలకు సాయం చేశారని ప్రశ్నించారు.
పదిలక్షల ఉద్యోగం, ఉద్యోగం అని చెప్పారని, కానీ ఏడాది గడిచినా తెలంగాణ కోసం మృతి చెందిన విద్యార్థుల లెక్క దొరకలేదా అని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు 481 మందిని మాత్రమే గుర్తించారని విమర్శించారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న విద్యార్థులను గుర్తించేందుకు ఏడాది సరిపోలేదా అన్నారు.
నాడు ఓయు విద్యార్థులను వీరులు, శూరులుగా కీర్తించిన కేసీఆర్, తెలంగాణ మీతోనే వస్తుందని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు తమ భూములు తీసుకోవద్దని చెబితే ఓయూ విద్యార్థుల పైన విమర్శలు చేయడం దారుణమన్నారు. కేసీఆర్ సమగ్ర సర్వే పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు.
తెలంగాణ కోసం పోరాడిన వారు ఎవరు ఇప్పుడు సంతోషంగా లేరన్నారు. అమరులైన విద్యార్థులకు స్థూపం నిర్మాణం పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ కుర్చీలోంచి కూలదోసే వరకు మా పోరాట ఆగదన్నారు. ఓయు విద్యార్థులను సోయిలేనివాళ్లు, అవగాహన లేని పోరాగాళ్లనడం విడ్డూరమన్నారు.
ఉస్మానియా విద్యార్థుల వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే అంశాన్ని మరుగున పరిచేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్ల తెలంగాణ రావడం బాగా ఆలస్యమైందన్నారు. అమరుల ప్రాణత్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు.
తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు బలిదానం చేసుకున్నారన్నారు. అమరుల కుటుంబాలను ఆదుకుంటామనిహామీ ఇచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు హామీలన్నీ మర్చిపోయి పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు కేసీఆర్, తెరాస నేతలను చెట్టుకు కట్టేసి, లాగుల్లో తొండలు విడవాలన్నారు. ఎన్నో ఆశలతో కలల సౌధమైన రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఎన్నికల హామీలు, డబుల్ బెట్ రూం ఫ్లాట్, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య, అమరవీరులకు నజరానా, ఉద్యోగాలు, దళితులకు మూడు ఎకరాల భూములు.. ఇలా ఏ హామీ నెరవేరలేదన్నారు.
టీడీపీ అధికారంలోకి రాగానే హుస్సేన్ సాగర్ బుద్ధుడి విగ్రహం పక్కన రూ. వెయ్యి కోట్లతో అమరవీరుల స్థూపం నిర్మిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి అమర వీరుల కుటుంబాలు - తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం అనే తీర్మానాన్ని మహానాడులో ప్రవేశ పెట్టారు.
కాగా, తొలి రోజు మహానాడులో... టీడీపీ సభ్యత్వం, కార్యకర్తల సంక్షేమం, రైతు సాధికారత, లాభసాటి వ్యవసాయం, తెలంగాణ అమరవీరులు - సర్కారు నిర్లక్ష్యం, ఏపీ ఆర్థిక పరిస్థితి పైన తీర్మానాలు ప్రవేశ పెట్టారు.