నేనంటేనే వణుకు: కేసీఆర్-నమస్తే తెలంగాణలపై రేవంత్ ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మానస పుత్రిక నమస్తే తెలంగాణ పేపర్ ఓ చెల్లని కాగితం అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి గురువారం ధ్వజమెత్తారు. తాను మైక్ పట్టుకుంటే అధికార తెరాస నేతలు వణుకుతున్నారని ఎద్దేవా చేశారు.
మంత్రికి తెలియకుండా చెక్పోస్టులు ఎత్తివేసినందుకు మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ ఓ మిషన్ కరెప్షన్ అన్నారు. అక్రమాలు బయటపెడతారనే జర్నలిస్టులపై ఆంక్షలు విధించారని ఆరోపించారు. ఛెస్ట్ ఆసుపత్రిని తొలగించి, అక్కడకు సచివాలయ తరలింపును అడ్డుకుంటామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలలకు విడుదల చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల్లో అప్పటి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీని పైన మంత్రి సూర్యాపేట కోర్టులో ఫిర్యాదు చేశారు.
దీనిపై పొన్నం స్పందించారు. అవినీతి ఆరోపణలకు వ్యతిరేకంగా తనపై మంత్రి పరువునష్టం దావా వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మీరు కోర్టుకు వెళితే, మేం ప్రజాకోర్టుకు వెళతామన్నారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి బీజేపీ నేతలే సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణకు రైల్వే ప్రాజెక్టులను సాధించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారన్నారు.