బయటపెడ్తామని టిటిడిపి, వైఎస్ వద్దన్నారని చిన్నారెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కనుసైగల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శనివారం మండిపడ్డారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరు దొరల కోసం గడీల పాలనను తపిస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేల హక్కులను కాలరాశారని, కెసిఆర్ ఒత్తిడికి స్పీకర్ తలొగ్గారన్నారు.
తెలంగాణకు సంబంధించిన పది తీర్మానాలపై చర్చ జరగకుండా ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు. పోలవరం ముంపు మండలాలపై సభలో సభ్యులకు అవకాశం ఇస్తే గతంలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు బయటపడతాయనే ఉద్దేశంతోనే హడావుడిగా తీర్మానాలను ఆమోదించారన్నారు.
అమరుల త్యాగాల ఫలితంగానే మనం తెలంగాణ అసెంబ్లీలో ఉన్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలని, ఉద్యమ భాగస్వాములందరినీ గౌరవించాలన్నారు. తెలంగాణ కోసం తొలి ప్రాణ త్యాగం జరిగిన రోజును తెలంగాణ అమరవీరుల స్మారక దినంగా పాటించాలని, శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్పీ పదవి ఇవ్వాలని కోరారు. వచ్చే సమావేశాల్లో తెరాస బండారం బయటపెడతామని మరో నేత ఎర్రబెల్లి దయాకర రావు హెచ్చరించారు.
వైయస్ తెలంగాణ వద్దన్నారు: చిన్నా రెడ్డి
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏ మాత్రమూ ఇష్టం ఉండేది కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే డాక్టర్ చిన్నారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అమరులకు సంతాపం తెలిపేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానంపై శాసనసభలో శనివారం జరిగిన చర్చలో పాల్గొంటూ, వైయస్కి తాను అత్యంత సన్నిహితుడని అంటూ చిన్నారెడ్డి ప్రకటించుకున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మినహాయించి, ఏది కోరినా అంగీకరిస్తానని వైయస్ అనేక పర్యాయాలు తమతో స్పష్టంగా చెప్పారన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారని కాంగ్రెస్ చిన్నారెడ్డి అన్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారికి ఇస్తున్న రాయితీలు, సౌకర్యాలు తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు అందించాలని, స్వాతంత్ర సమర యోధుల హోదా కల్పించాలని చిన్నారెడ్డి కోరారు.