ఏపీకి కేంద్రం మొండి చేయి: చంద్రబాబు హయాంలోలాగానే చిక్కుల్లో జగన్
ఆంధ్రప్రదేశ్కు మొండి చేయి చూపడం కేంద్రంకు పరిపాటైపోయింది. కేంద్రమంత్రి నిర్మలా గురువారం సీతారామన్ తొలిసారి ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ మళ్లీ అన్యాయానికి గురైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్... తాజాగా కేంద్రం చిన్న చూపు చూడటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసినట్లయ్యింది.
ఎక్కువ సంపాదించు, ఎక్కువ పన్ను కట్టు,, ఇదే నిర్మలా తారకమంత్రం
Recommended Video
బడ్జెట్లో ఏపీకి అన్యాయం
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎలాంటి కేటాయింపులు జరపలేదు. ఇప్పటికే ఆర్థిక లోటుతో వెంటిలేటర్పై ఉన్న ఆంధ్రప్రదేశ్ పట్ల కనీసం సవితి తల్లి ప్రేమ కూడా చూపించలేదు కేంద్రం. ఇక కొత్త ప్రభుత్వంలో హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్న సీఎం జగన్ను డిఫెన్స్లో పడేసినట్లయ్యింది. కేంద్రంతో ఏపీ ప్రభుత్వం సఖ్యతతో మెలుగుతున్నప్పటికీ బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకున్నారు. కేంద్రం ఇలా వ్యవహరించడంపై చాలా వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.
బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్పై రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడం నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీని ఎలా సమానంగా చూస్తారని ధ్వజమెత్తారు. అదనంగా ఏపీకి ఏమి కేటాయించారని ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్రానికి నిధులు ఎంత కేటాయిస్తున్నారనేదానిపై స్పష్టత లేదని చెప్పిన విజయ్ సాయి రెడ్డి... రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని చెప్పారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందాకైనా పోరాడుతామని తమ హక్కులు సాధించేవరకు వైసీపీ పార్టీ గొంతు వినిపిస్తుందని విజయసాయి రెడ్డి తెలిపారు.
చిక్కుల్లో జగన్.. సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తారు..?
ఇదిలా ఉంటే ఏపీలో ఆర్థికలోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు నిధులు అవసరం. కేంద్రం తమకు న్యాయం చేస్తుందన్న భావనలో సీఎం జగన్ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో కేంద్రం నుంచి నిధుల విషయంలో ఎలాంటి భరోసా రాలేదు. దీంతో జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైయస్సార్ జయంతి సందర్భంగా జూలై 8 నుంచి వృద్ధాప్య పెన్షన్లు, ఆ తర్వాత అమ్మఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ రూ.15వేలు, రైతు భరోసా కింద రైతులకు రూ. 12500 ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు. ఆ పథకాలు అమలు చేయాలంటే నిధులు కావాలి మరి లోటు బడ్జెట్లో ఉన్న ఏపీని కేంద్రం గట్టెక్కిస్తుందనుకుంటే మొండి చేయి చూపడంతో ఆ పథకాలపై నీలిమేఘాలు అలుముకున్నాయి. రెవిన్యూలోటుతో ఉన్న ఏపీని కేంద్రం ఆదుకుంటుందని ఎంతో ఆశగా చూసినా ఆ ఆశలు ఆవిరయ్యాయ్యి.
మొత్తానికి చంద్రబాబు హయాంలో ఎలాగైతే కేంద్రం మొండి చేయి చూపిందో అలాంటిదే కొత్త ప్రభుత్వంలో కూడా పునరావృతమైందనే అభిప్రాయాన్ని పొలిటికల్ అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు.