చంద్రబాబు ఉండవల్లి నివాసానికి నోటీసులు: కృష్ణా వరదే కారణం!
అమరావతి: పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జరీ చేశారు. కాగా, పులిచింతల నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో 5.11 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 5.06లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ రాత్రికి వరద ఉధృతి 8 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర పండుగగా బాలు జయంతి: సీఎం జగన్కు లేఖ, అంతర్వేది రథ నిర్మాణంపై చంద్రబాబు ఇలా
ఇక బ్యారేజీ దిగువ ప్రాంతంలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. యనమలకుదురు, పెదపులిపాక, కేసరనేనివారిపాలెం, మద్దూరు ప్రాంతాల్లో కృష్ణానదిని ఆనుకుని ఉణ్న పంట పొలాలు జలమయమయ్యాయి. నదికి సమీపంలోని నివాసాలు, ఆలయాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది ఇలావుంటే, కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఉండవల్లిలోని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి స్థానిక రెవెన్యూ అధికారులు నోటీసులు అంటించారు. ఎగువ నుంచి సుమారు 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటంతో కృష్ణా కరకట్టపై ఉన్న నివాసాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు నివాసానికి కూడా నోటీసులు అంటించారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఈ నోటీసులు అంటించలేదని.. అప్రమత్తంగా ఉండాలని మాత్రమే అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. వరద వచ్చిన సమయంలో గతంలో కూడా అధికారులు ఈ విధంగా నోటీసులు జారీ చేశారు.