భూపాలపల్లిలో గండ్రVsగండ్ర: చారికి కొండా సురేఖ అండ
వరంగల్: వరంగల్ జిల్లా భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ తరఫున గండ్ర వెంకటరమణ రెడ్డి, బిజెపి - టిడిపి పొత్తులో భాగంగా బిజెపి తరఫున గండ్ర సత్యనారాయణ రావు, తెరాస అభ్యర్థిగా సిరికొండ మధుసూదనా చారిలు ప్రధానంగా పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు నేతలు.. అభివృద్ధి, సానుభూతి, సెంటిమెంట్ల పైన ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో ఏకైక పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది.
గండ్ర వెంకటరమణ రెడ్డి అభివృద్ధే మంత్రంగా దూసుకెళ్తున్నారు. బిజెపి అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు సానుభూతి పవనాలపై ఆశలు పెట్టుకోగా... సిరికొండ మధుసూదనా చారి తెలంగాణ సెంటిమెంటు ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్నారు. కోల్బెల్ట్ ప్రాంతమైన భూపాలపల్లిలో సింగరేణి కార్మికుల ఓట్లు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. సింగరేణి కార్మికుల ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తాయి.
2009లో భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర వెంకటరమణ రెడ్డి గెలిపొందారు. ఈ నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి బాట పట్టించారు. ముఖ్యమంత్రులందరితోనూ సన్నిహితంగా మెలుగుతూ నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులను రాబట్టారు. అసెంబ్లీ సమావేశాలు లేకుంటే గండ్ర మకాం నియోజకవర్గంలోనే. తాను చేసిన అభివృద్ధే తనకు విజయాన్ని అందిస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. దీనికితోడు సింగరేణి ఓట్లు తనకు సునాయాస విజయాన్ని అందిస్తాయని ఆయన భావిస్తున్నారు.
టిడిపికి 30 ఏళ్లుగా సేవలందిస్తున్నా టికెట్ రాకపోవడంతో గండ్ర సత్యనారాయణ రావు బిజెపిలో చేరి టికెట్ సాధించారు. టిడిపి టికెట్ రాలేన్న సానుభూతి ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. అది తనకు వరంగా మారుతుందని ఆయన భావిస్తున్నారు. ఆ పార్టీ శ్రేణులతో తనకున్న సాన్నిహిత్యం కూడా తన గెలుపును ఖాయం చేస్తుందని ఆయన లెక్కలు వేస్తున్నారు. అంతేకాకుండా బిజెపి తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడింది. ఇది కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. నియోజకవర్గంలో బిజెపికి కేడర్ ఉంది.
సిరికొండ తెరాస అభ్యర్థిగా రెండోసారి బరిలోకి దిగుతున్నారు. తొలుత టిడిపి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 2001లో తెరాస ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించి వ్యవస్థాపక సభ్యుడిగా, పొలిట్బ్యూరో సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర చేతిలో ఓడిపోయారు. తెలంగాణ సెంటిమెంటుకు తోడు ఇటీవల కొండా దంపతులు తెరాసలో చేరడంతో సిరికొండకు అదనపు బలం చేకూరినట్లయ్యింది. కొండా దంపతులకు భూపాలపల్లి, శాయంపేట వంటి మండలాల్లో గట్టి పట్టు ఉంది.