జనగాం: కోడలు నిలిపేనా, కొమ్మూరిపై సానుభూతి
హైదరాబాద్: వరంగల్ జిల్లా జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో హేమాహేమీలు పోటీలో ఉన్నారు. కాంగ్రెసు తరఫున టి కాంగ్రెసు అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, టిడిపి మద్దతుతో బిజెపి తరఫున కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, తెరాస తరఫున ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలు బరిలో ఉన్నారు. తెలంగాణ ఇచ్చామని చెబుతూ పొన్నాల వర్గం, తెలంగాణ తమ వల్లే వచ్చిందని బిజెపి, తెరాసలు ప్రచారం చేస్తున్నాయి.
గత ఎన్నికల్లో తెరాస తరఫున పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడటమే కాకుండా... తెరాస నుండి బయటకు పంపించడం కొమ్మూరి పైన కొంత సానుభూతి ఉంది. ఈ ముగ్గురు కూడా జిల్లాలోనే అత్యంత ఎక్కువ ఆస్తులు చూపించారు. పొన్నాల లక్ష్మయ్య అంతా టి పిసిసిపై భారం వేశారు. పైగా ఈ పదవి జనగామ నియోజకవర్గ ప్రజలకే అంకితమని ప్రకటించారు.
పొన్నాల గెలుపు బాధ్యతను ఆయన కోడలు పొన్నాల వైశాలి అంతా తానై నియోజకవర్గంలో తిరుగుతున్నారు. టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలంగాణ ఉద్యమమే తనను గట్టెక్కిస్తుందనే ధీమాలో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటులో తెరాసదే కీలకం అని ఆయన ధీమాతో ఉన్నారు. ఆయనకు క్యాడర్ ఉంది.
కొమ్మూరి పైన సానుభూతితో పాటు... తెలంగాణ కోసం బిజెపి కీలకంగా వ్యవహరించిందని ప్రజల్లో విశ్వాసం ఉందనే విశ్వాసంతో ఉన్నారు. అంతేకాకుండా టిడిపి మద్దతు గట్టెక్కిస్తుందని భావిస్తున్నారు. అయితే, కొందరు కీలక టిడిపి నేతలు తెరాసలోకి వెళ్లడం ప్రభావం చూపవచ్చు. ముగ్గురు కూడా హేమాహేమీలే కావడంతో పోటీ రసవత్తరంగా సాగింది. ఇప్పటికే వరుసగా మూడుసార్లు విజయం సాధించిన పొన్నాల లక్ష్మయ్య మరోసారి గెలుపొందాలని ఉవ్విల్లూరుతున్నారు.