నాగర్కర్నూలు: తెరాస బిజినెస్మెన్తో నాగం కొడుకు ఢీ
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా ఉంది. ఒకప్పుడు టిడిపిలో ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి ఇప్పుడు బిజెపి నుండి మహబూబ్ నగర్ లోకసభకు పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన తనయుడు నాగం శశిధర్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.
తెరాస నుండి ప్రముఖ వ్యాపారవేత్త మర్రి జనార్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన గత ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. అప్పుడు నాగం జనార్ధన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇక నాగర్కర్నూల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జిగా కొనసాగుతున్న కూచుకుళ్ల దామోదర్రెడ్డి తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్నారు.
నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిటింగ్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయకుండా తన తనయుడిని బరిలోకి దింపినప్పటికీ... ఇక్కడ ప్రచార బాధ్యతలు, ఎన్నికల వ్యూహాలు సిటింగ్ ఎమ్మెల్యే నాగం ద్వారానే కొనసాగుతుండగా, ఎన్నికల బాధ్యతలను పరోక్షంగా నాగం జనార్ధన్ రెడ్డియే నిర్వహిస్తున్నారు.
ఒకప్పుడు ఒకే రాజకీయ పార్టీలో ఉండి కలిసి మెలిసి తిరుగుతూ గడిపిన ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారిన నాటి మిత్రులు వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయ కార్యక్రమాలను కొనసాగిస్తుండటం నాగర్ కర్నూలు ప్రత్యేకత!
2009 సాధారణ ఎన్నికలతోపాటు 2012లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఏ పోలింగ్ కేంద్రంలో తక్కువ ఓట్లు వచ్చాయి, అక్కడ ఓట్లను పెంచుకునేందుకు ఏం చేయాలనే దానిపై వ్యూహ రచన చేయడంలో నిమగ్నమయ్యారు. ఒక వైపు కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తునే మరోవైపు ప్రచార వ్యూహాన్ని కూడా రచించడంలో ఇరు నేతలు నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికలను కూచుకుళ్ల, నాగం, మర్రిలు వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాత్రింబవళ్లు పని చేస్తున్నారు.