హీట్ పెంచిన పురంధేశ్వరి: జగన్ పార్టీ, సాయిలతో ఢీ
రాజంపేట: కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి రాజంపేట నుండి పోటీ చేస్తుండటంతో మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఒకవిధంగా పురంధేశ్వరి ఇక్కడి నుండి పోటీ చేయడం హీట్ పెంచింది. రాజంపేటలో త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి సాయి ప్రతాప్, బిజెపి అభ్యర్థి పురంధేశ్వరి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పివి మిథున్ రెడ్డి, జై సమైకాంధ్ర పార్టీ అభ్యర్థి జి ముజుబుస్సేన్లు పోటీలో ఉన్నారు.
పురంధేశ్వరి, సాయి ప్రతాప్లు నిన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్నారు. ఒకే ప్రభుత్వంలో (యూపిఏ) కేంద్రమంత్రులుగా పని చేశారు. ఇప్పుడు వీరి మధ్య పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గ కేంద్రం కడప జిల్లాలో ఉన్నప్పటికీ దీని పరిధిలో పక్క జిల్లా చిత్తూరులోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు, కడప జిల్లాలోని చెందిన మూడు సెగ్మెంట్లు వస్తాయి.
పురంధేశ్వరి బరిలో నిలవడంతో ఇక్కడి పోటీ త్రిముఖంగా మారింది. ఎన్టీఆర్ కూతురుగానే కాకుండా యూపిఏ హయాంలో తనకంటూ ఇమేజ్ కలిగి ఉన్నారు పురంధేశ్వరి. ఆమె సామాజిక వర్గ బలం కూడా ఉంది. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
ఆరుసార్లు లోకసభకు ప్రాతినిథ్యం వహించిన సిట్టింగ్ ఎంపి సాయిప్రతాప్కు తన బలిజ సామాజికవర్గంతోపాటు మైనార్టీలు కూడా కలిసి రావడంతో అప్రతిహతంగా విజయాలు అందుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఆ బలాన్నే ఆయన నమ్ముకున్నారు. విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభావం ఓటర్లపై పడకుండా ఒంటరిగా ప్రచారం చేస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ బరిలో ఉన్న తన తండ్రి పలుకుబడితో చిత్తూరు జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లలో భారీ ఆధిక్యత సాధిస్తానని, అలాగే కడప జిల్లాలోని పార్టీ అండతో గట్టెక్కుతానని భావిస్తున్నారు. కిరణ్ పార్టీ సమైక్యాంధ్ర నినాదంపై ఆశలు పెట్టుకుంది.