సనత్నగర్: సెటిలర్స్,మోడీ హవాతో మర్రితో తలసాని ఢీ
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సనత్ నగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ నుండి మర్రి శశిధర్ రెడ్డి, టిడిపి నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెరాస నుండి విఠల్లు బరిలో నిలిచారు. హ్యాట్రిక్ కొట్టాలని మర్రి ఉవ్వీళ్లూరుతున్నారు. టిడిపికి మంచి క్యాడర్ ఉంది. దానికి తోడు బిజెపి బలం తనను గెలిపిస్తుందని తలసాని ధీమాగా ఉన్నారు. సెంటిమెంటుతో విఠల్ దూసుకెళ్తున్నరు.
పట్టణ ప్రాంతాల్లో బిజెపికి సానుకూల ఓటు ఉంది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో బిజెపి చురుకైన పాత్ర పోషించింది. తెలంగాణ బిల్లు విషయంలోను అదే పాత్ర పోషించింది. అలాంటి బిజెపి మద్దతు, టిడిపి క్యాడర్తో తన గెలుపు ఈజీ అవుతుందని తలసాని చెబుతున్నారు.
లోక్సత్తా పార్టీ అభ్యర్థిగా హైమా ప్రవీణ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి రామ్మోహన్ ఉన్నప్పటికీ త్రిముఖ పోటీనే నెలకొంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మూడుసార్లు టిడిపి విజయం సాధించగా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలిచింది.
మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్ రెడ్డి సనత్నగర్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ప్రజలకు అందుబాటులో ఉండరనే వాదన ఉంది. మైనారిటీ ఓట్లు, కాంగ్రెస్ సంప్రదాయ ఓటుబ్యాంకు ఆయనకు కలిసి రానుంది. అభివృద్ధిని అజెండాగా చేసుకుని మర్రి ప్రచారం నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా వీస్తున్న మోడీ గాలి, బలమైన ప్రత్యర్థిగా తలసాని ఉండటంతో మర్రి గెలుపు ఈజీ కాదు.
పొత్తు తలసానికి కలిసి రానుంది. ఇక్కడ బిజెపికి బలమైన కేడర్ ఉండడంతోపాటు సెటిలర్లు ఎక్కువగా ఉండటం, దేశవ్యాప్తంగా మోడీ హవా ఉండటం తలసానికి కలిసివచ్చే అంశాలు. మైనార్టీ ఓట్లు కూడా కీలకంగా మారాయి. అధికంగా ఉన్న బిసి ఓట్లు అదే వర్గానికి చెందిన తలసానికి లాభం చేకూర్చే అవకాశం ఉంది. తలసానికి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ ఆయనకు లాభిస్తుంది.
తెలంగాణ సెంటిమెంట్ను నమ్ముకుని తెరాస అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు. విఠల్ ఎన్నారై. స్థానికేతరుడు కావడం, సెటిలర్లు ఎక్కువగా ఉండడం తెరాసకు ప్రతికూలాంశాలు. నియోజకవర్గంలో మున్నూరు కాపు ఓట్లు ఎక్కువగా ఉండడం, విఠల్ అదే సామాజికవర్గ అభ్యర్థి కావడం కలిసి వచ్చే అంశంగా ఉంది.