వరంగల్ తూర్పు: సురేఖకి చిరు నేత అండ, సారయ్య..?
వరంగల్: వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోరు ఈసారి ఆసక్తికరంగా మారింది. ఇందుకు తెరాస తరఫున మాజీ మంత్రి కొండా సురేఖ, కాంగ్రెసు పార్టీ నుండి బస్వరాజు సారయ్య బరిలో నిలవడమే. దీనికి తోడు టిడిపితో మద్దతుగా బిజెపి అభ్యర్థి పద్మ అమరేందర్ రెడ్డి చాపకింద నీరులా దూసుకెళ్తున్నారు. ఇక్కడ కాంగ్రెసు, తెరాస మధ్యల హోరాహోరి కనిపిస్తున్నప్పటికీ.. టిడిపి పొత్తు కారణంగా బిజెపిని కూడా తక్కవ అంచనా వేయలేని పరిస్థితి ఉంది.
పూర్తిగా అర్బన్ నియోజకవర్గం అయిన తూర్పులో సగానికి పైగా ఓటర్లు బిసిలే. ఈ నియోజకవర్గం నుండి బస్వరాజు 2009 వరకు మూడుసార్లు వరుసగా గెలిచారు. ఇప్పుడు నాలుగోసారి కొండా సురేఖతో ఢీ కొడుతున్నారు. రజక సామాజిక వర్గానికి చెందిన సారయ్యకు బిసిలు, మైనారిటీ ఓటర్లలో మంచి పట్టు ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అన్న నినాదంతో ప్రచారం సాగిస్తున్నారు. అయితే, కుమారుడి రాజకీయ అరగేంట్రం తర్వాత కొంత ఆయన అనుచర వర్గం దూరమైంది.
కొండా దంపతులకు వరంగల్ జిల్లాలో మంచి పట్టు ఉంది. ప్రధానంగా పరకాల, వరంగల్ తదితర నియోజకవర్గాల్లో వారి హవా ఉంటుంది. వారి హవాకు తోడు తెరాసలో చేరినందున కలిసి వస్తుందని భావిస్తున్నారు. అయితే, గతంలో ఉద్యమకారుల పైన రాళ్లు విసిరిన కొండా దంపతులను ఎలా చేర్చుకున్నారని కాంగ్రెసు ప్రశ్నిస్తోంది. దీనిని ఆయుధంగా ఉపయోగిస్తోంది. సురేఖ మాత్రం తన పరిచయాలతో పాటు సెంటిమెంట్ను నమ్ముకున్నారు.
గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన శాయంపేట నియోజకవర్గానికి చెందిన ప్రజల్లో చాలామంది బతుకుదెరువు కోసం వచ్చి వరంగల్ తూర్పులో స్థిరపడటం ఆమెకు కలిసి వచ్చే అంశం. గత ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో పాటు పలువురు నేతలు తెరాసలో చేరడం గమనార్హం. అయితే, తూర్పు నియోజకవర్గంలో తెరాస గెలిచిన రికార్డు లేకపోవడం, ఇక్కడి నుంచి మొదటిసారి పోటీ చేయడం, స్థానికేతరురాలన్న ముద్ర ఆమెకు ప్రతికూలాంశాలు.
టిడిపితో ఎన్నికల పొత్తులో భాగంగా ఆ పార్టీ మద్దతుతో బిజెపి అభ్యర్థిగా పద్మా అమరేందర్ రెడ్డి బరిలో నిలిచారు. తెలంగాణ ఉద్యమంలో బిజెపి పాల్గొంది. ఇది ఆమెకు కలిసి వచ్చే అంశం. అలాగే పొత్తు కారణంగా బలమైన టిడిపి క్యాడర్ ఆమెకు మద్దతు ఇవ్వనుంది. ఆమెకు మద్దతుగా టిడిపి నేత గుండు సుధారాణి ప్రచారంలో పాల్గొంటున్నారు.