పోలవరం: సాకులు వెతికే పనిలో చంద్రబాబు, జగన్పైనే నిందలు..
అంతకు మించి వ్యయం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కూడా ఇటీవలే కేంద్రం కుండ బద్దలు కొట్టింది. కానీ దీనికి చంద్రబాబు సాకులు వెతికే పనిలో పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం ప్రాజెక్టును సందర్శించిన ఆయన రేడియల్ గేట్ల తయారీ, స్పిల్ వే, డయాఫ్రం వాల్ పనులను పరిశీలించారు.
తర్వాత అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2014 అంచనాల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని చెప్పిందని గుర్తు చేశారు. అంతకు మించి వ్యయం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కూడా ఇటీవలే కేంద్రం కుండ బద్దలు కొట్టింది. కానీ దీనికి చంద్రబాబు సాకులు వెతికే పనిలో పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉంటుందని, 2011 అంచనాల ప్రకారమే నిధులు లెక్క గట్టారని కూడా చంద్రబాబు తెలిపారు. కానీ ఇక్కడ ఒక్క విషయం విస్మరిస్తున్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను చివరి వరకు అడ్డుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు.. జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించినప్పుడు దాని నిర్మాణ వ్యయాన్ని తాజా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించాలని ఎందుకు ప్రశ్నించలేదని ఆర్థిక నిపుణులు అడుగుతున్నారు.
చంద్రబాబులో మొదలైన ఆందోళన
2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. తాజాగా కేంద్రం నిధుల కేటాయింపుపై తేల్చేయడంతో ఏపీ సీఎం చంద్రబాబులో ఆందోళన మొదలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే 2010 - 11 నాటి అంచనాలను సవరించి కేంద్రానికి పంపుతామనే వాదన తీసుకొచ్చారని చెప్తున్నారు. ఈ నెల 24వ తేదీన పోలవరం ప్రాజెక్ట్ పురోగతిపై ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో జరిగే సమావేశంలో అన్ని విషయాలు వివరిస్తామని కూడా తెలిపారు. ప్రాజెక్టు అంచనాలను దాని ప్రయోజనాల ద్రుష్ట్యా సవరించడం బాగానే ఉన్నా దాని నిర్మాణం ఎప్పట్లోగా పూర్తవుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల వాదన కొట్టి పారేస్తున్న ఏపీ సీఎం
ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ‘ట్రాన్స్టాయ్' పనితీరు మెరుగ్గా ఉంటే అధికారులను మందలించాల్సిన పనేమిటన్న విమర్శలు ఉన్నాయి. సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్రాజెక్టుకు 48 గేట్లకు గాను ఐదు గేట్లు పూర్తయ్యాయని వివరించారు. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటంటే మూడు పూర్తి కాగా, మరో రెండు నిర్మాణంలో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టు పనులు పూర్తిచేసే సత్తా ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ ‘ట్రాన్స్ ట్రాయ్'కి లేదని ఏపీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. అంతెందుకు ఆ సంస్థకు సరిపడా మానవ వనరులు లేక పనులు సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించారని, వారికి బిల్లులు చెల్లించక ఆ సంస్థలు పనులు జాప్యం చేస్తున్నాయని వివరించారు.
ప్రాజెక్టు పూర్తిపై అధికారులు ఇలా..
నిర్దేశిత లక్ష్యాలను అధిగమించకపోతే గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని అధికారులు తేల్చిచెప్పారు. మట్టి పనులు చేస్తోన్న త్రివేణి సంస్థకు రూ.140 కోట్లకుపైగా ట్రాన్స్ట్రాయ్ చెల్లించలేక పోయిన వైనాన్ని ఉదహరించారు. ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాం, డయా ఫ్రమ్ వాల్ పనులు నిర్వహిస్తున్న బావర్, ఎల్ అండ్ టీ సంస్థలకు ట్రాన్స్ట్రాయ్ బిల్లులు చెల్లించడం లేదన్నారు. కానీ దీనిపై అధికారుల తీరునే ఏపీ సీఎం చంద్రబాబు మందలించారు. ‘మంచి జరిగితే మీ పని లేదంటే ఇతరుల పనా?' అని అధికారులకు చంద్రబాబు చివాట్లు పెట్టారు.
వైఎస్ హయాంలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభం
కొన్ని రాజకీయ శక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు తగులుతున్నారని పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి విమర్శలు గుప్పించారు. వాస్తవమేమిటంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పుడే గోదావరి జలాలపై ‘పోలవరం' ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా గుర్తుండే ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు.
అధికారులపై ఏపీ సీఎం చంద్రబాబు ఇలా
పోలవరం పనులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన అధికారులు.. ట్రాన్స్ట్రాయ్ సంస్థ తీరును వివరించినా పరిగణనలోకి తీసుకోని చంద్రబాబు.. పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని, పైగా వాస్తవాలు చూడాలంటూ అధికారులకే అక్షింతలు వేసి వారు అవాక్కయేలా చేశారు. పనులు చేసే సత్తా లేని ట్రాన్స్ట్రాయ్కి సీఎం వెసులుబాట్లు కల్పిస్తుండటంలో ఆంతర్యమేమిటని పలువురు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ముందుకు సాగని స్పిల్ వే, డయాఫ్రం వాల్ పనులు
14.11 లక్షల క్యూబిక్ మీటర్ల పొడవునా స్పిల్వే కాంక్రీట్ పనులు పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 32 వేల క్యూబిక్ మీటర్ల మేరకు మాత్రమే పని పూర్తయింది. స్పిల్ వే మట్టి పనుల్లో 10.55 కోట్ల క్యూబిక్ మీటర్లకు 6.55 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి. వచ్చే ఆగస్టు నాటికి డయా ఫ్రమ్ వాల్ పనులు 667 మీటర్లు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకూ కేవలం 28 మీటర్ల వరకు మాత్రమే పని పూర్తయింది. పనులు ఇలానే సాగితే పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పాక్షికంగా 2019 నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లందించడం అసాధ్యమని అధికారులు తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఏ కాంట్రాక్టర్కూ సరఫరా చేయని రీతిలో స్టీలు, సిమెంటు ప్రభుత్వమే సరఫరా చేస్తున్నా కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.