డిమాండ్లు పరిష్కరించకుంటే...అసెంబ్లీ ముట్టడిస్తాం:ఉపాధ్యాయ సంఘాల హెచ్చరిక
గుంటూరు:విద్యార్థులకు పాఠాలు చెప్పుకుంటూ విధినిర్వహణలో తలమునకలుగా కనిపించే ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలో భాగంగా గుంటూరులో జరిగిన ఉద్యమంలో పాల్గొన్న ఫ్యాఫ్టో నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని వారు డిమాండ్ చేశారు.
ఫ్యాఫ్టో పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాలు కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించాయి. గుంటూరులో జరిగిన ఆందోళనలో భాగంగా వేలాదిమంది ఉపాధ్యాయులు వందలాదిమంది ఉపాధ్యాయులు కలెక్టరేట్ ను ముట్టడించారు. దీంతో ఉదయం 11.30 గంటల వరకూ కలెక్టరేట్ ఉద్యోగులు కార్యాలయంలోకి విధులకు వెళ్లలేకపోయారు. ఈ సందర్భంగా ఫ్యాఫ్టో ఛైర్మన్ బాబురెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు.
దీంతో పోలీసులు ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ పి.బాబురెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, జెఎసి సెక్రెటరీ జనరల్ జోసఫ్ సుధీర్, యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు వెంకటేశ్వర్లు సహా వెయ్యి మంది ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు.
మరోవైపు కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులను పెద్ద ఎత్తున మోహరించినప్పటికీ ఉపాధ్యాయులు వెనుకంజ వేయలేదు. వీరికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు సహా సిఐటియు నాయకులను, వందలాది మంది ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి చిలకలపూడి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదే క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలో వేలాది మంది ఉపాధ్యాయులు మూడు వైపులుగా ఉన్న దారుల నుంచి నినాదాలు చేసుకుంటూ ఏలూరు కలెక్టరేట్లోకి దూసుకెళ్లారు.
వారిలో ఒకరిద్దరిని లాగి అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించి బెదరకుండా వేలాదిమంది ఉపాధ్యాయులు ముందుకు దూసుకుపోయారు. కలెక్టరేట్ గేట్లు ఎక్కి మరీ కొందరు లోనికి దూకారు. పోలీసులు బలవంతంగా వారిని బయటకు పంపే ప్రయత్నం చేశారు. కలెక్టరేట్ బయట మరికొందరు ఉపాధ్యాయులు రోడ్డుపై మధ్యాహ్నం వరకూ బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు, యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ సాబ్జీ మాట్లాడుతూ సిపిఎస్ రద్దుకు అన్ని పార్టీలూ మద్దతిచ్చాయన్నారు. బిజెపి, టిడిపి మాత్రం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేందుకు ముందుకు రావడం లేదని విమర్శించారు.
ఇదేవిధంగాప్రకాశం,నెల్లూరు,కర్నూలు,కడప,చిత్తూరు,అనంతపురం,తూర్పుగోదావరి,విశాఖపట్టణం,విజయనగరం,శ్రీకాకుళం, ఇంకా పలు జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలను ఉపాధ్యాయులు ముట్టడించగా వేలాది మందిని పోలీసులు పోలీసులు అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది. అయితే కొన్ని చోట్ల సిపిఎస్కు వ్యతిరేకంగా కలెక్టరేట్ల వద్ద ముట్టడికి దిగిన ఉపాధ్యాయులతో పోలీసులు కూడా తమకు అదే సమస్య ఉందని చెప్పుకొని వాపోయారట.
సిపిఎస్ రద్దు కోసం జిల్లా కలెక్టర్ల కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఖండించారు. పోలీసులు ఆర్టిసి బస్సులోకి చొరబడి ఉపాధ్యాయులను దించేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని తెలిపారు. ఉపాధ్యాయులపై నిర్బంధం ప్రయోగించడం సరికాదని తెలిపారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, నిర్బంధ చర్యలను విడనాడాలని డిమాండ్ చేశారు.