రోజా పక్కన ఉన్న బాలయ్యను అంత మాట అనేసిన ఆర్జీవీ .. ఆ సెల్ఫీపై ఏమన్నారంటే
శాసనమండలి లాబీల్లో అధికార వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరిగిన రోజు అక్కడికి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక ఆ సందర్భంగా మండలి లాబీలో రోజా, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తో కలిసి సెల్ఫీలు తీసుకోవటం కూడా రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా లాబీ నుంచి మండలిని డిక్టేట్ చేశాడని, ఇక అదే సమయంలో రోజా సిల్లీగా బాలయ్యతో సెల్ఫీలు తీసుకుందని వైసీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ సెల్ఫీ వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు .
రోజాతో బాలయ్య సెల్ఫీపై స్పందించిన ఆర్జీవీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణతో ఏపీఐఐసీ ఛైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సెల్ఫీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి . అయితే ఈ ఫోటోలపై వివాదాస్పద దర్శకుడురాం గోపాల్ వర్మ తనదైన స్టైల్ స్పందించాడు. ఆ ఫోటోలను తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేస్తూ వరుస కామెంట్లు చేశాడు. బాలయ్యను అనరాని మాటలు అన్నారు .
అతనెవరో ఆమెకు దిష్టి బొమ్మ కావచ్చన్న వర్మ
సెల్ఫీలో రోజాగారు హీరోలా కనిపిస్తున్నారన్న రాం గోపాల్ వర్మ ఆమె కుడి పక్కన ఉన్న వ్యక్తి ఎవరో గానీ అసహ్యంగా(యాక్)గా ఉన్నారని పేర్కొన్నారు . ఈ ఫ్రేమ్లో అతను రోజా గారి అందాన్ని పాడు చేస్తున్నారని వ్యాఖ్యానించారు . ఒకవేళ అతను ఆమెకు దిష్టి బొమ్మ కావచ్చు అని వర్మ ట్వీట్ చేశాడు. ఇక అంతే కాదు ఆ తర్వాత ‘అందమైన రోజా గారి పక్కన కూర్చుని ఆ ఫోటోను నాశనం చేసిన ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా? అని కోరుతూ పోస్ట్ పెట్టారు.
ఆ సెల్ఫీలోని వ్యక్తి ఎవరో చెప్పగలరా .. ?వర్మ వెటకారం
బాలకృష్ణ ఎవరో తనకు తెలీదు అన్నట్టుగా వర్మ మరో ట్వీట్ చేశాడు. ఇక దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. మొత్తానికి బాలయ్యను వర్మ తన వ్యాఖ్యలతో రోజాకు దిష్టిబొమ్మను చేశారు . అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో చర్చ సందర్భంగా అటు అధికార పక్ష సభ్యులు, ఇటు ప్రతిపక్ష సభ్యులు మండలి వీఐపీ గ్యాలరీల్లో నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలను వీక్షించారు.
బాలయ్యను వర్మ టార్గెట్ చెయ్యటంపై భగ్గుమన్న ఫ్యాన్స్
ఈ సందర్భంగా బాలకృష్ణను ఆర్కే రోజా మర్యాదపూర్వకంగా పలకరించి, కాసేపు మాట్లాడారు . అనంతరం రోజాతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు బాలయ్యతో సెల్ఫీలు దిగారు. ఇందులో బాలయ్య కావాలని తీసుకున్న చొరవ ఏమీ లేకున్నా బాలయ్యను వర్మ టార్గెట్ చేసి కామెంట్ చేశారు . అసలు చేసిందంతా రోజా చేస్తే బాలయ్యను అనటం దేనికి అని బాలయ్య అభిమానులు భగ్గుమంటున్నారు.