ఆర్జీవి రివర్స్ ఎటాక్ : టిడిపి నేతల పై కేసులు : లీగల్ నోటీసు జారీ..
వివాదాలకు మారు పేరుగా నిలిచే దర్శకుడు రాం గోపాల్ వర్మ టిడిపి నేతల పై రివర్స్ ఎటాక్ ప్రారంభించారు. వెన్ను పోటు పాట పై టిడిపి నేతలు వర్మను టార్గెట్ చేసారు. దీంతో..తన పై కేసులు పెడితే తాను వారి పై కేసులు పెడతానని వర్మ హెచ్చరించారు. అందులో భాగంగానే..టిడిపి నేతకు లీగల్ నోటీసు పంపారు..
టిడిపి నేతలకు లీగల్ నోటీసులు
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా దర్శకుడు రాం గోపాల్ వర్మ టిడిపి నేతలకు లీగల్ నోటీసులు పంపటం ప్రారంభించారు. ఆ సినిమా లో వెన్నుపోటు పాటను ఆర్జీవి ఇటీవల విడుదల చేసారు. ఆ పాటలో ఏపి సీయం చంద్రబాబు నాయుడు ను డామేజ్ చేసే విధంగా చూపించారని టిడిపి నేతలు ఆర్జీవి పై భగ్గుమన్నారు. ఆ పాటను నిలిపివేసేలా చర్యలు తీసుకో వాలని ఎమ్మెల్యే వర్మ హైకోర్టును ఆశ్రయించారు. మరో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు II టౌన్ పోలీస్ స్టేషన్లో వర్మపై ఫిర్యాదు చేశారు.
ఆర్జీవి సైతం ఘాటుగా నే రిప్లై
తమ నేత చంద్రబాబును వర్మ కించపరిచారని ఈ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఆర్జీవి వెంటనే క్షమాణ చెప్పి ఆ పాటను తొలిగించాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిని ఆర్జీవి సైతం ఘాటుగా నే రిప్లై ఇచ్చారు. పాట చూస్తేనే ఎందుకు ఇంతగా కంగారు పడుతున్నారని..తాను ఉన్నదే చూపిస్తున్నానని బదులు ఇచ్చారు. లక్ష్మీ పార్వతి ప్రవేశం తరువాత ఎన్టీఆర్ జీవితం పైనే తాను సినిమా తీస్తున్నానని స్పష్టం చేసారు.
ఎమ్మెల్యేలకు లీగల్ నోటీసు..
టిడిపి నేతలు ఆరోపిస్తున్నట్లు తాను చంద్రబాబు ను ఒక్క మాట అనలేదని వర్మ తన ట్వీట్ ద్వారా చెప్పారు. తాజా గా.. తన పై హైకోర్టులో కేసు వేసిన ఎస్వీ వర్మకి తన లాయర్ ఎస్ ప్రభాకర్ ద్వారా లీగల్ నోటీసులు జారీ చేశారు. అందు లో ఆర్జీవి లాయర్ ఆర్జీవి ఉద్దేశాన్ని స్పష్టం చేసారు. 50కి పైగా చిత్రాలు నిర్మించిన తన క్లైంట్కి చాలా గొప్ప పేరు ఉంది. టీజర్లో ఎవరిని అవమానించకముందే.. ఆయనపై కేసు పెట్టి ఆయన ప్రతిష్ట దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని... 48 గంటల్లోగా నా క్లైంట్పై పెట్టిన కేసును వెనక్కి తీసుకొని.. బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నోటీసులో లాయర్ ప్రభాకర్ పేర్కొన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి సైతం లీగల్ నోటీసులు జారీ చేశానని లీగల్ నోటీసు డ్రాఫ్ట్ కాపీని వర్మ ట్వీట్ చేశారు. మరి దీనిపై ఎస్వీ మోహన్ రెడ్డి ..వర్మ..టిడిపి నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.