కొడుకులై ఉండీ..అల్లుళ్లై ఉండీ..నాపై చెప్పులేయించారు: వర్మ మార్క్ వైస్రాయ్ కుట్ర సీన్
అమరావతి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రాజకీయ జీవితంలో అత్యంత విషాదకర ఘట్టం.. వైస్రాయ్. హైదరాబాద్ వైస్రాయ్ హోటల్ లో కేంద్రంగా ఎన్టీ రామారావును పదవీచ్యుతుడిని చేయడానికి సాగిన కుట్రను ఆయన అభిమానులు అంత త్వరగా విస్మరించలేదు. అందులో కూడా- ఎన్టీ రామారావుపై చెప్పులు వేయించిన సందర్భం చీకటి ఘట్టం. మరిచిపోదామనుకున్నా మరిచి పోలేని చేదు జ్ఞాపకం అది. ఎప్పుడూ వివాదాలను వెంటేసుకుని తిరిగే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీఎస్ ఎన్టీఆర్ పేరుతో తీసిన సినిమాలో- అందరి దృష్టీ వైస్రాయ్ కుట్ర మీదే నిలిచింది. ప్రత్యేకించి- ఎన్టీ రామారావుపై చెప్పులేయించిన సన్నివేశం నిజమైన ఎన్టీ రామారావు అభిమానుల చేత కంటతడి పెట్టించింది.
హైకోర్టు స్టే ఇవ్వడంతో మన రాష్ట్రంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాలేదు గానీ.. తెలంగాణ సహా మిగిలిన అన్ని చోట్లా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని కీలక సన్నివేశాలు ఉన్న వీడియోలో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఎన్టీ రామారావుపై చెప్పులు వేయించిన సన్నివేశానికి చెందిన వీడియో కూడా ఇందులో ఉంది. సుమారు ఆరు నిమిషాల పాటు ఉన్న ఈ సీన్.. రామ్ గోపాల్ వర్మ ఎంత సమర్థవంతమైన దర్శకుడో స్పష్టం చేస్తోందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియోలో ఉన్న సన్నివేశం ప్రకారం.. ఎన్టీ రామారావు అల్లుడు బాబూరావు, కుమారుడు హరి సహా పలువురు ఎమ్మెల్యేలు వైస్రాయ్ హోటల్ లో సమావేశాన్ని నిర్వహిస్తుంటారు. అదే సమయంలో తన అభిమానులు, తనతో పాటు మిగిలిన శాసనసభ్యులు, పార్టీ కార్యకర్తలతో ఆ హోటల్ ప్రధాన గేటు వద్దకు వస్తారు. లక్ష్మీపార్వతి పాత్రధారితో కలిసి చైతన్యరథంపై నిల్చుని.. ఆర్ధ్రత నిండిన స్వరంతో ప్రసంగిస్తారు. ఆ దుర్మార్గుడి మాటలు నమ్మవద్దని ప్రాధేయపడతారు. ఎమ్మెల్యేలంతా తన బిడ్డలేనని, తన వద్దకు రావాలని విజ్ఞప్తి చేస్తారు.
అయినప్పటికీ హోటల్ నుంచి ఎలాంటి స్పందనా రాదు. ఓ వైపు చెమట తుడుచుకుంటూ, మరోవైపు ఆవేదనను, ఆవేశాన్ని అణచుకుంటూ ఎన్టీ రామారావు పాత్రధారి తన ప్రసంగాన్ని కొనసాగిస్తుంటారు. ఇదంతా హోటల్ లో కూర్చుని గమనిస్తున్న చంద్రబాబు పాత్రధారి.. తన అనుచరుల్లో ఒకరిని దగ్గరకు పిలిచి, చెవిలో ఏదో చెబుతారు. ఆ సమయంలో హరికృష్ణ పాత్రధారి చంద్రబాబు పక్కనే ఉండటం ఈ సీన్ లో చూపించారు. అంటే- కుమారుడు హరికృష్ణకు తెలిసే చంద్రబాబు ఆయన తండ్రిపై చెప్పులే వేయించారనేది దాని సారాంశం.
అంతే! అక్కడ సీన్ కట్ చేస్తే.. గేటు వద్ద ఆవేశంగా ప్రసంగిస్తున్న ఎన్టీ రామారావుపై హోటల్ నుంచి చెప్పులు వచ్చి మీద పడతాయి ఏకధాటిగా. వాటి నుంచి తప్పించుకోవడానికి ఎన్టీ రామారావు, తప్పించడానికి లక్ష్మీ పార్వతి చేసిన ప్రయత్నాలు ఫలించవు.
చెప్పుల వర్షం ఆగిపోయిన తరువాత ఎన్టీ రామారావు పాత్రధారి నోటి నుంచి వచ్చిన తొలి పలుకులు.. నిజమైన అభిమానుల్లో ఆవేశాన్ని కట్టలు తెంచుకునేలా చేస్తుంది. కొడుకులు అయివుండీ, కూతుళ్లు అయివుండీ, అల్లుళ్లు అయివుండీ.. నేను గెలిపించిన ఎమ్మెల్యేలు అయివుండీ.. నాపై చెప్పులు వేయించారు. నేను బతికి ఉండగానే చెప్పులతో కొట్టించారు.. అని ఆవేదన వ్యక్తం చేస్తారు. సరిగ్గా అక్కడే.. దగా, దగా అనే పాట ఆరంభమౌతుంది.