లక్ష్మీస్ ఎన్టీఆర్: రాజకీయ ఆధిపత్యం: చంద్రబాబుకు ఇంత వయస్సు వచ్చినా..!
Recommended Video
అమరావతి: అటు తిరిగి, ఇటు తిరిగి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రాజకీయ రంగు పులుముకొంది. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం సద్దు మణిగిన రాజకీయ వేడి.. ఈ సినిమాతో మళ్లీ రాజుకుంది. వేడెక్కింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు దారి తీసింది. సమకాలీన రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఓ సినిమాను కేంద్ర బిందువుగా చేసుకుని ఈ రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
పరస్పరం మాటల తూటాలు విసురుకుంటున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అండగా నిలిచారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కావడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చేయాల్సిన ప్రయత్నాన్నీ చేస్తున్నారు. దీనికోసం పోలీసు యంత్రాంగాన్ని కూడా దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
చంద్రబాబుపై కామెంట్లకు వివరణ ఇచ్చుకున్న ద్వివేది: ఇకనైన ఆగుతుందా రచ్చ?
ప్రెస్ మీట్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం: వైఎస్ జగన్
రామ్ గోపాల్ వర్మ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకున్నారు, ఆర్జీవీకి మద్దతుగా ట్వీట్ చేశారు. విజయవాడలో ప్రెస్ మీట్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉందంటూ ఎద్దేవా చేశారు. పోలీసులను బంట్రోతుల కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే ప్రజాస్వామ్యం అంటే అని ప్రశ్నించారు. రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు.
నిజాన్ని దాచలేరు:
తనకు అండగా నిలిచినందుకు రామ్ గోపాల్ వర్మ వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. నిజాన్ని పాతరేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నిజాన్ని దాయడం ఎవరి వల్లా కాదని, ఇంత వయస్సు వచ్చినప్పటికీ.. ఆ విషయం చంద్రబాబుకు ఎందుకు అర్థం కావట్లేదని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను విజయవాడలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటానని, దీనికోసం అవసరమైతే న్యాయపోరాటం చేస్తానని చెప్పారు.
జగన్, కేసీఆర్, మోడీ డైరెక్షన్ లో ఆర్జీవీ..
ఇదిలావుండగా.. తెలుగుదేశం పార్టీ ఎప్పట్లాగే- తన పాత వాదనను వినిపిస్తోంది. రామ్ గోపాల్ వర్మ వెనుక వైఎస్ జగన్, కేసీఆర్, నరేంద్రమోడీ ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారి అండ చూసుకునే రామ్ గోపాల్ వర్మ రెచ్చిపోతున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి జగన్-కేసీఆర్-మోడీ కుట్ర పన్నుతున్నారని, దీనికోసం రామ్ గోపాల్ వర్మను పావుగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.
40 ఏళ్ల వయస్సు వచ్చినా..
చంద్రబాబు నాయుడుకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండీ , డుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసీ ఒక్క సినిమాకు భయపడుతున్నారని రామ్ గోపాల్ వర్మ ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు నిజంగా ఈ సినిమా చూసి భయపడితే... ఆయన లోకేష్ పప్పు ఫాదరేనని చురకలు అంటించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ కోసం విజయవాడకు వచ్చిన ఈ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డి సహా యూనిట్ సభ్యులను స్థానిక పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్ గానీ, ప్రెస్ మీట్లు గానీ ఏర్పాటు చేయకూడదని అంటూ పోలీసులు రామ్ గోపాల్ వర్మను ఆదేశించారు.
వారు బస చేసిన హోటల్ గదుల నుంచి బలవంతంగా ఖాళీ చేయించి, విజయవాడ వదిలి వెళ్లాలని హుకూం జారీ చేసిన విషయం తెలిసిందే. చిత్రం యూనిట్ సభ్యులందర్నీ గన్నవరం విమానాశ్రయంలో వదిలేశారు పోలీసులు. అక్కడి నుంచి విజయవాడలోకి రానివ్వలేదు. విమానాశ్రయంలోనే నిర్బంధించారు. సాయంత్రం 4 గంటల సమయంలో పైపుల రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రామ్ గోపాల్ వర్మ నిర్వహించ తలపెట్టిన ప్రెస్ మీట్ ను రద్దు చేశారు. ఇదివరకు ఇచ్చిన అనుమతులను కూడా పోలీసులు రద్దు చేశారు. హుటాహుటిన ఆయనతో పాటు చిత్రం యూనిట్ సభ్యులందర్నీ హైదరాబాద్ కు పంపించి వేశారు.