చంద్రబాబుపై ట్వీట్ చేసి చిక్కుల్లో పడ్డ వర్మ... తాజాగా కేఏ పాల్, బాలయ్యలపై సెటైర్లు !
ఆయన పేరుగాంచిన డైరెక్టర్. ఒక సినిమా మొదలు పెడుతున్నారంటే అక్కడి నుంచి వివాదాలు కూడా ప్రారంభం అవుతాయి. ఆయన సినిమాలకు పెద్ద ప్రమోషన్ అక్కర్లేదు. కేవలం మౌత్టాక్తోనే ఆయనకు కావాల్సినదానికంటే ఎక్కువగానే ప్రమోషన్ లభిస్తుంది. అంతలా ఆయన ఫేమస్. పోనీ ఒక్క తెలుగులోనే ఆయన చక్రం తిప్పుతున్నారా అంటే అదీ కాదు... ఏ భాషలో సినిమా తీసినా.. భాషతో సంబంధం లేకుండా తన సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకోగల దమ్మున్న డైరెక్టర్. ఇప్పటికే ఆ డైరెక్టర్ ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది. యస్... మీరు ఊహించిన పేరు కర్టెక్టే. ఆయనే రాంగోపాల్ వర్మ. ముద్దుగా ఆర్జీవీ అని కూడా పిలుస్తారు. ఇంతకీ తాజాగా ఆర్జీవీ మళ్లీ వార్తల్లో ఎందుకు నిలిచారో తెలుసా...?
టీడీపీనే రాంగోపాల్ వర్మ లక్ష్యమా..?
రాంగోపాల్ వర్మ... షార్ట్గా ఆర్జీవీ అని పిలుస్తారు. రాంగోపాల్ వర్మ పేరే కాంట్రవర్శీ అని చెప్పొచ్చు. ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు సినీ అభిమానులు గుమికూడి ఆర్జీవీ గురించి చర్చించుకుంటున్నారంటే వారి మధ్య ఆయన క్రియేట్ చేసిన కాంట్రవర్శీగురించే అయి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జస్ట్ ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల చేసి ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ వారికి నిద్రపట్టకుండా చేశారు ఆర్జీవీ. ఎంతలా అంటే ఆ సినిమా ఏపీలో రిలీజ్ అయితే టీడీపీకి ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమే అన్న ఫీలింగ్ వారిలో క్రియేట్ చేశారు. దీంతో వారు కోర్టులను ఆశ్రయించి సినిమా ఏపీలో విడుదల కాకుండా స్టే తెచ్చుకున్నారు. కానీ అక్కడి ఏపీ ప్రజలు మాత్రం అదే పనిగా తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు వెళ్లి సినిమా చూసి వచ్చారు. హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోగలిగారు కానీ... సినీ అభిమానులను మాత్రం సినిమా చూడకుండా నిలువరించలేకపోయారు. అది రాంగోపాల్ వర్మకు ఉన్న స్టామినా అని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే.
వైరల్ అవుతున్న వర్మ ట్వీట్
సోషల్ మీడియాలో తెగ యాక్టివ్గా ఉండే రాంగోపాల్ వర్మ తాజాగా ఏపీ ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. సర్వేలన్నీ వైసీపీకి మొగ్గు చూపుతుండటంతో రాంగోపాల్వర్మ కూడా తనదైన శైలిలో టీడీపీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్జీవీ చేస్తున్న ట్వీట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెండు రోజుల క్రితం రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ తెగ వైరల్ అయ్యింది. చంద్రబాబు నాయుడుకు జగన్ వైసీపీ కండువా కప్పుతున్న ఫోటో ఒకటి ఆర్జీవీ ట్వీట్ చేశారు. "వావ్ షాకింగ్ చంద్రబాబు నాయుడు ఇప్పుడే వైసీపీలో చేరారు" అంటూ ట్వీట్ చేశారు.
బాలయ్యపై కామెంట్ చేసిన వర్మ
తాజాగా మరో ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ. ఇది కూడా తెగ వైరల్ అవుతోంది. వైసీపీ అధినేత జగన్ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా చంద్రబాబుకి ఫించన్ 3వేలు, లోకేష్కు గ్రామ సచివాలయంలో ఉద్యోగం, బ్రహ్మణికి అమ్మఒడి పథకం కింద 1500 రూపాయలు, బాలకృష్ణకు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అనే ఫోటోను ఆర్జీవీ ట్వీట్ చేశారు. అంతేకాదు బాలయ్యకు మెరుగైన వైద్యం కాదు...మెరుగైన మానసిక వైద్యం అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు.
కేఏ పాల్ పై కాంట్రవర్శీ ట్వీట్
ఇక ఏప్రిల్ 13న మరో ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన ఓటు హక్కును వినియోగించుకుని బయటకు వచ్చి సంతోషంతో గెంతులు వేసిన వీడియోను తన ట్విటర్లో రామూ పోస్ట్ చేశారు.పోస్టు చేస్తూ మరో వివాదాస్పద కామెంట్ కూడా ట్వీట్ చేశాడు. "గొలుసేసి కట్టేయకపోతే కరుస్తాడేమో " అంటూ కాంట్రవర్శీ ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ. అంతేకాదు కేఏ పాల్ టైం అయిపోయింది కొత్త కేఏ పాల్ టైం స్టార్ట్ అయ్యిందంటూ చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. కేఏ పాల్ చంద్రబాబులు మాత్రమే ఈవీఎంల గురించి ఫిర్యాదు చేస్తున్నారంటూ ట్వీట్లో పేర్కొన్నారు. కేఏ పాల్ చంద్రబాబు అయ్యారా.. లేక చంద్రబాబు కేఏ పాల్ అయ్యారా అని ట్వీట్ చేశారు. మరో తాజా ట్వీట్లో పవన్ కళ్యాణ్ను కూడా ఆర్జీవీ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. మొన్న అలీ పవన్పై మాట్లాడిన వీడియోను పోస్టు చేస్తూ.. ఒక కమెడియన్ ఓ హీరోలా మాట్లాడటం తొలిసారి చూస్తున్నట్లు ఆర్జీవీ ట్వీట్ చేశారు. అంతేకాదు ఒక హీరో కమెడియన్లా మాట్లాడటం కూడా తొలిసారి చూస్తున్నానంటూ పవన్పై పరోక్ష సెటైర్లు వేశారు ఆర్జీవీ.ఆర్జీవీ చేస్తున్న ట్వీట్లపై ఇప్పటికే హైదరాబాదులో కేసు నమోదైంది.
మొత్తానికి రాంగోపాల్ వర్మను చూస్తూ ఈ సారి ఎన్నికలను చాలా క్లోజ్గా ఫాలో అయినట్లు తెలుస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్తో పొలిటికల్ కాంట్రవర్శీకి తెరలేపిన రాంగోపాల్ వర్మ నిన్న ముగిసిన ఏపీ ఎన్నికలను కూడా నిశితంగా పరిశీలిచినట్లు తెలుస్తోంది. తన పొలిటికల్ సెటైర్లు కేవలం ఏపీ రాజకీయాలకే పరిమితం చేస్తారా లేక జాతీయ రాజకీయాలపై కూడా పంచ్లు వేస్తారా అనేది వేచి చూడాలి .