జెపి లోకసత్తాలో ముసలం: నేతల బహిష్కరణ
హైదరాబాద్: జయప్రకాష్ నారాయణ స్థాపించిన లోక్సత్తా పార్టీలో విభేదాలు తలెత్తి రచ్చకెక్కాయి. పార్టీ నుంచి కటారి శ్రీనివాస్తో పాటు ఏపీ అధ్యక్షుడు వర్మ, ప్రధాన కార్యదర్శి రమేష్రెడ్డిని బహిష్కరించారు. పార్టీ అధ్యక్షుడిగా జయప్రకాష్ నారాయణ తప్పుకోవడంతో వివాదాలు బహిర్గతమవుతున్నాయి.
జయప్రకాష్ నారాయణకు చెందిన వర్గాన్ని పక్కన పెడుతున్నారనే విమర్శలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీవాత్సవ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాలోని పలువురు పార్టీ నేతలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వీరిలో ముఖ్యంగా పార్టీలో కీలక నేతగా ఉన్న కటారి శ్రీనివాస్, ఏపీ ప్రెసిండెంట్ వర్మ, ప్రధాన కార్యదర్శి రమేష్రెడ్డిపై పార్టీ బహిష్కరణ వేటు వేశారు. వీటిని సంబంధించిన వివరాలను పార్టీ గోప్యంగా ఉంచింనట్లు మీడియాలో బుధవారంనాడు వార్తలు వచ్చాయి. అంతర్గత కారణాల వల్లే వీరిపై వేటు వేసినట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించి రెండు రాష్ర్టాల వర్కింగ్ కమిటీలు రహస్యంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా లోకసత్తా పార్టీలో విభేదాలు పొడసూపుతూ వస్తున్నాయి. గతంలో నాయకులు మీడియాకు ఎక్కిన ఉదంతం కూడా ఉంది.