అంబానీకి జగన్ భారీ గిఫ్ట్ : సొంత పార్టీ నేతలకు షాక్, తెరవెనక అమిత్షా కీ రోల్..!
తాడేపల్లి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. అంబానీతో పాటు చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యులు పారిశ్రామిక వేత్త పరిమల్ నత్వానీ కూడా సీఎం జగన్ను కలిశారు. ఆంధ్రప్రదేశ్లో తమ కంపెనీల ఏర్పాటు, వివిధ ప్రాజెక్టులపై వీరు సీఎం జగన్తో చర్చించడంతో పాటు ఇతర రాజకీయ అంశాలను కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
సభా సమయం: మార్చి 6 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు..?
సీఎం జగన్తో ముఖేష్ అంబానీ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్తో సమావేశమయ్యారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీతో పాటు రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానీ, ఆకాష్ అంబానీలు సీఎంతో భేటీ అయ్యారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంకు ప్రత్యేక విమానంలో చేరుకున్న అంబానీకి ఘనస్వాగతం పలికారు ఎంపీ విజయ్సాయిరెడ్డి.ఈ సందర్భంగా ఏపీలో పారిశ్రామికంగా ఉన్న అవకాశాలపై సీఎం జగన్తో చర్చించారు. అదే సమయంలో పరిమల్ నత్వానీ రాజకీయ భవిషత్తుపై కూడా చర్చించినట్లు సమాచారం. ఇంతకీ పరిమల్ నత్వానీ ఎవరు..? అంబానీతో పాటు సీఎం జగన్ను ఎందుకు కలిశారు అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
పరిమల్ నత్వానీ ఎవరు..? అంబానీతో ఎందుకొచ్చారు..?
పరిమల్ నత్వానీ ముందుగా పారిశ్రామికవేత్త. 1990వరకు ఆయన వ్యాపారం చేసుకునేవాడు. 1997లో రిలయన్స్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. 2016 సమాచారం ప్రకారం ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో కార్పొరేట్ అఫెయిర్స్కు చీఫ్గా ఉన్నారు. ముందుగా ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీతో చాలా దగ్గరగా మెలిగిన వ్యక్తి నత్వానీ. అంతేకాదు గుజరాత్లోని జామ్నగర్లో ధీరుభాయ్ అంబానీ నెలకొల్పిన తొలి క్రూడ్ ఆయిల్ పరిశ్రమ పనులన్నీ దగ్గరుండి చూసుకున్న వ్యక్తి పరిమల్ నత్వానీ. ప్రస్తుతం అంబానీకి కుడిభుజంగా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్లో కీలక వ్యక్తిగా నత్వానీ ఎదిగారు. రిలయన్స్ చేపట్టిన పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి నత్వానీ. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న 22 టెలికాం సెక్టార్లలో 4 జీ సేవలను రోల్ అవుట్ చేయడంలో కూడా నత్వానీ కీలకంగా వ్యవహరించారు.
ఏపీ నుంచి రాజ్యసభకు నత్వానీ...?
ఇక రాజకీయంగా చూస్తే నత్వానీ రెండు సార్లు బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జార్ఖండ్ నుంచి తొలిసారిగా 2008లో పెద్దల సభకు ఎన్నిక కాగా తిరిగి 2014లో కూడా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక ఈయన పదవి ఏప్రిల్ 9తో ముగియనుంది. అయితే జార్ఖండ్లో ఈసారి జేఎంఎం ప్రభుత్వంలోకి రావడంతో ఆరాష్ట్రం నుంచి బీజేపీకి రాజ్యసభ స్థానం లేనట్టే. ఈ క్రమంలోనే తిరిగి పరిమల్ను రాజ్యసభకు పంపేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే పరిమల్ను ఏపీ నుంచి పెద్దల సభకు పంపాలని యోచిస్తోంది. ఇక ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలవడంతోనే దీనిపై ఒక డీల్ జరిగినట్లు సమాచారం.
సీఎం జగన్ను అంబానీ కలిసింది అందుకేనా..?
ఏప్రిల్ 9న ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు వెకేట్ కానున్నాయి. వైసీపీకి మెజార్టీ ఉన్నందున నాలుగు సీట్లు ఆ పార్టీ ఖాతాలోకే వస్తున్నాయి. ఇక్కడ మూడు సీట్లను వైసీపీ అభ్యర్థులకు కేటాయించి మరో సీటును బీజేపీకి కేటాయించేలా ఢిల్లీ సమావేశంలో డీల్ కుదిరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆ ఒక్క సీటును ముఖేష్ అంబానీ కుడిభుజమైన పరిమల్ నత్వానీకి ఇచ్చేలా అమిత్ షాతో ఒప్పందం కుదిరిందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే రిలయన్స్ అధినేత స్వయంగా తాడేపల్లికి వచ్చి సీఎం జగన్తో సమావేశమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం జగన్కు అంబానీ థ్యాంక్స్ కూడా చెప్పినట్లు సమాచారం. ఇక అదే సమయంలో పరిశ్రమలపై కూడా అంబానీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కొత్త ప్రాజెక్టులను ఏపీలో పెట్టేందుకు ఈ అపరకుబేరుడు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఏపీ నుంచి వైసీపీ కోటాలో ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి అమిత్ షా సూచనలపై పరిమల్ నత్వానీకి వెళ్లడంతో ఇక ఆశావాహులు మూడు సీట్లకు పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది.