రిషికేశ్వరి ఆత్మహత్య: మాజీ ప్రిన్సిపల్ బాబురావు అరెస్ట్, జైలుకు
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి ఘటనలో నాటి ప్రిన్సిపల్ బాబురావును పోలీసులు బుధవారం నాడు అరెస్టు చేశారు. అతనిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. అతనికి కోర్టు రిమాండ్ విధించింది. అతనిని పోలీసులు జైలుకు తరలించారు.
నాగార్జున వర్సిటీలో రిషికేశ్వరి ఆత్మహత్య గత ఏడాది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితులుగా ఉన్న సీనియర్ విద్యార్థులను శ్రీనివాస్, జయచరణ్, అనీషలను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వారు బెయిల్ పైన విడుదలయ్యారు.
అయితే, రిషికేశ్వరి ఆత్మహత్యలో బాబురావు కీలక నిందితుడు అని, అతనిని అరెస్టు చేయాలని రిషికేశ్వరి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాబురావును శిక్షిస్తేనే తమ కూతురు కేసులో పూర్తి న్యాయం జరిగినట్లు అవుతుందని తండ్రి పలుమార్లు చెప్పారు.
మరోవైపు, ఈ ఘటన పైన ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో విచారణ కమిటీని వేసింది. ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదికలో అఫ్పటి ప్రిన్సిపల్ బాబురావు పాత్ర ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా బాబురావును అరెస్టు చేశారు.