'అతనూ రిషికేశ్వరితో అసభ్యంగా వ్యవహరించాడు, సిబిఐ దర్యాఫ్తు కావాలి'
గుంటూరు: తన కూతురు రిషికేశ్వరి ఆత్మహత్య ఘటన పైన సిబిఐతో దర్యాఫ్తు జరిపించాలని తండ్రి మురళీ కృష్ణ ఆదివారం డిమాండ్ చేశారు. ఆయన గుంటూరు జిల్లా కలెక్టర్ను, అర్బన్ ఎస్బీని కలిసి వినతి పత్రం అందజేశారు. అభిషేక్ అనే విద్యార్థి కూడా తన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించినట్లు డైరీలో ఉందని చెప్పారు.
దీని పైన కూడా విచారణ జరిపించాలని కోరారు. లైంగిక వేధింపులు, ర్యాగింగ్ను ప్రోత్సహించిన బాబురావును అరెస్టు చేయాలని కోరారు. కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఇవి పూర్తయ్యే వరకు పోలీసులు ఛార్జీషీటును దాఖలు చేయడాన్ని ఆపాలని కోరారు.
ర్యాగింగ్ నిరోధక చట్టంలోని అంశాలను పకడ్బంధీగా అమలు చేయాలని కోరారు. బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక ఆధారంగా బాబురావును విధుల నుంచి తొలగించారని, దీనిని ప్రాతిపదికగా తీసుకొని కేసు నమోదు చేయాలని కోరారు.
రిషికేశ్వరి మృతికి పది రోజుల ముందే వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసినా అప్పటి ప్రిన్సిపల్ బాబురావు పట్టించుకోలేదన్నారు. రిషికేశ్వరి మృతి చెందినట్లు వర్సిటీ వైద్యురాలు నిర్ధారించిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వకుండా జిజిహెచ్కు తరలించారన్నారు.
ప్రిన్సిపల్ మానసిక పరిస్థితి పైన గతంలో కళాశాల అధ్యాపకులు గవర్నర్కు లేఖ రాశారని మురళీ కృష్ణ కలెక్టర్, అర్బన్ ఎస్పీ దృష్టికి తీసుకు వచ్చారు. ఆయన ఆదివారం సాయంత్రం వారిని కలిశారు. అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.