రిషికేశ్వరి ఆత్మహత్య: ముగ్గురు నిందితులకు బెయిల్, షరతులు
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి కేసులో నిందితులకు బెయిల్ లభించింది. ముగ్గురు నిందితులు శ్రీనివాస్, జయచరణ్, అనీషాలకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
గుంటూరు జిల్లా ఒకటో అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం వారికి గురువారం నాడు బెయిల్ ఇచ్చింది. రిషికేశ్వరి ముగ్గురు నిందితులకు 77 రోజుల తర్వాత బెయిల్ లభించింది.
వారికి పలు షరతులు విధించింది. కేసుకు సంబంధించి ఎవరినీ ప్రభావితం చేయవద్దని, నాగార్జున విశ్వవిద్యాలయంలోకి నెల రోజుల పాటు వెళ్లవద్దని, ముగ్గురిలో ఎవరికైనా పాస్ పోర్టు ఉంటే పోలీసులకు సీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది.
అలాగే, ప్రతి వారంలో రెండు రోజుల పాటు పోలీసు స్టేషన్కు వెళ్లి, తాము ఎక్కడ ఉన్నామో సమాచారం ఇవ్వాలని, సంతకం పెట్టాలని న్యాయస్థానం ఆదేశించింది.
కాగా, దాదాపు మూడు నెలల క్రితం రిషికేశ్వరి నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు ముగ్గురు ఇన్నాళ్లు సబ్ జైలులో ఉన్నారు. గతంలో రెండుసార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నా బెయిల్ రాలేదు. ఈ రోజు వచ్చింది.
రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు నాటి ప్రిన్సిపల్ బాబురావు అని తల్లిదండ్రులు, విపక్షాలు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. బాబురావు పైన ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఈ కేసుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.