రిషికేశ్వరి డైరీ మాకివ్వండి: కోర్టు ఆదేశం, 'పేరు లేదు.. ఇరికించారని ట్విస్ట్'
గుంటూరు: జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరికి చెందిన డైరీని న్యాయస్థానానికి అందజేయాలని మంగళగిరి ఎస్పీని కోర్టు మంగళవారం నాడు ఆదేశించింది.
రిషికేశ్వరి కేసులో నిందితుల బెయిల్ పైన వాదనలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. వారు ప్రస్తుతం జైలులో ఉన్నారు. అరెస్టయిన వారిలో ఇద్దరు అబ్బాయిలు, ఒకరు అమ్మాయి ఉన్నారు.
వారు బెయల్ పిటిషన్ దాఖలు చేయడంతో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా మంగళవారం న్యాయస్థానం... డైరీని కోర్టుకు ఇవ్వాలని మంగళగిరి ఎస్పీని ఆదేశించింది. డైరీని పరిశీలించిన అనంతరం నిందితుల బెయిల్ పైన కోర్టు తీర్పు ఇచ్చే అవకాశముంది.
డైరీలో మా కొడుకు పేరు లేదు, ఇరికించారు: ఓ ముద్దాయి పేరెంట్స్
రిషికేశ్వరికి చెందిన డైరీలో తమ అబ్బాయి పేరు లేదని, ఆ తర్వాత ఇరికించారని ఓ ముద్దాయి తల్లిదండ్రులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ పైన విచారణ సందర్భంగా ముద్దాయిల తల్లిదండ్రులు న్యాయస్థానానికి వచ్చారు.
ఈ సందర్భంగా ఓ ముద్దాయి తల్లిదండ్రులు ఓ ఛానల్ తో మాట్లాడారు. తాము పేదవాళ్లమని చెప్పారు. డైరీలో తమ అబ్బాయి పేరు మొదట లేదని, ఆ తర్వాత ఇరికించారని అన్నారు. దోషులను శిక్షించుకోవచ్చని చెప్పారు. ర్యాగింగ్ జరిగినట్లుగా ఆరోపిస్తున్న ఆరు నెలల తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.