రిషికేశ్వరి మృతి: బాబురావే చదివిస్తున్నాడు! 'అనీష పాత్రపై ఆధారాలు చూపండి'
గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనలో మరో కొత్త విషయం వెలుగు చూసింది. రిషికేశ్వరి పైన వేధింపులకు పాల్పడిన శ్రీనివాస్ అనే విద్యార్థిని ప్రిన్సిపల్ బాబురావు చదివిస్తున్నాడంటున్నారు.
రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపల్ బాబురావు పైన ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఆయన పైన ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. అయితే, తాజాగా రిషికేశ్వరి తండ్రి మురళీ కృష్ణ కొత్త విషయం చెప్పినట్లుగా తెలుస్తోంది.
వేధింపులకు పాల్పడిన శ్రీనివాస్ను కేసులో ప్రధాన నిందితుడు బాబురావు చదివిస్తున్నారని చెప్పారని తెలుస్తోంది. బాబురావు అండతోనే సీనియర్ విద్యార్థులు జూనియర్ అమ్మాయిల పైన వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రిషికేశ్వరి రెండో డైరీని సిఎం చంద్రబాబు, పోలీసులకు రిషికేశ్వరి తండ్రి ఇటీవల అందజేశారు.
అనీష పాత్రపై ఆధారాలు చూపాలన్న జాతీయ మహిళా కమిషన్
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషికేశ్వరి మృతి కేసులో సీనియర్ విద్యార్థిని అనీషా పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అనీష విద్యార్థిని... దీంతో ఆమె భవిష్యత్తు దృష్ట్యా జాతీయ మహిళా కమిషన్ దీనిని సుమోటోగా తీసుకుంది.
రిషికేశ్వరి మృతి కేసులో అనీషా పాత్ర పైన ఆధారాలు ఉంటే నివేదిక పంపించాలని జాతీయ మహిళా కమిషన్ నాలుగు రోజుల క్రితం పోలీసులు ఉన్నతాధికారులను ఆదేశించింది. దీంతో పోలీసులు అనీష పాత్ర పైన ఆధారాలు పంపించినట్లుగా తెలుస్తోంది.