రిషికేశ్వరి మృతి కేసు: బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదికపై ఉత్కంఠ
గుంటూరు/ హైదరాబాద్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఆర్క్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య సంఘటనపై ప్రభుత్వం నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ తన నివేదికలో ఏముందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. ఈ కమిటీ గత నెల 29న వర్సిటీకి చేరుకుని వీసీ కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిష్ట్రార్ పి.రాజశేఖర్, ఇతర అధికారులను విచారించింది.
విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. జూలై 30న విద్యార్థులు, వసతి గృహ వార్డెన్లు, విద్యార్థి సంఘాల నాయకులు, రిషికేశ్వరి తల్లిదండ్రులను విచారించారు. జూలై 31న వర్సిటీ కార్యవర్గ సభ్యులు కమిటీని కలిసి తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందజేశారు. ఆదివారం బాల సుబ్రహ్మణ్యం కమిటీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు హైదరాబాద్లో నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే.
నాగార్జు విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు, మహిళా హాస్టల్ వార్డెన్ స్వరూపరాణి తదితరులు కూడా విచారణ కమిటీ ముందు హాజరయ్యారు.
ఇదిలావుంటే, రిషితేశ్వరి కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ తెలంగాణ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి వినతిపత్రం అందించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హోంమంత్రి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు.