రిషికేశ్వరి కేసు: 'మైనర్ వేధింపు కేసు పెట్టాలి', బాబురావును శిక్షిస్తేనే: తండ్రి
గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి కేసులో గుంటూరు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆమె తరపు న్యాయవాది... ర్యాగింగ్కు గురైనప్పుడు ఆమె మైనర్ కావడంతో మైనర్ వేధింపుల కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం కేసు విచారణను కోర్టు ఈ నెల ఏడో తేదీకి వాయిదా వేసింది. కొద్ది రోజుల కింద పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. నాగార్జున వర్సిటీ ప్రిన్సిపల్ బాబురావును ఏ4 నిందితుడిగా పేర్కొన్నారు.
బాబూరావును అరెస్టు చేయాలని డిమాండ్
రిషికేశ్వరి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన పైన ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో విచారణ కమిటీని వేసింది. ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదికలో అఫ్పటి ప్రిన్సిపల్ బాబురావు పాత్ర ఉందని స్పష్టం చేసింది.
బాబురావును ఛార్జీషీట్లో నాలుగో నిందితుడిగా చేర్చారని, ఇప్పటికైనా అతనిని అరెస్టు చేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ప్రజా, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రిషికేశ్వరి తండ్రి మురళీకృష్ణ మాట్లాడుతూ... బాబురావును శిక్షిస్తేనే తమ కూతురు కేసులో పూర్తి న్యాయం జరిగినట్లు అవుతుందని, ప్రస్తుతం పోలీసులు ఛార్జీషీటులో అతని పేరును చేర్చడం వల్ల కేసు న్యాయం వైపు అడుగులు వేస్తున్నట్లు భావించవచ్చునని చెప్పారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు.