రిషికేశ్వరి ఆత్మహత్య: మరో ఇద్దరి హస్తం, 14న ఏం జరిగింది?
గుంటూరు: ర్యాగింగ్ కారణం చేత నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్ధిని రిషికేశ్వరి హత్యకు దారితీసిన కారణాలను వెలికితీసేందుకు జిల్లా ఎస్పీ అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి రంగంలోకి దిగారు. ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న ఒక సీనియర్, నలుగురు జూనియర్ విద్యార్ధులను డీఎస్పీ ఆఫీసులో ఆయన రెండు గంటల పాటు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
రిషికేశ్వరి తన డైరీలో సూసైడ్ నోట్ను రాసింది. ఆ డైరీలో పేర్లను చెరిపేసింది ఎవరు? ఆమె ఆత్మహత్య చేసుకున్న జులై 14 రాత్రి ఏం జరిగింది లాంటి ప్రశ్నలను విద్యార్ధులను అడిగినట్లు సమాచారం. రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకన్న రాత్రి 11 గంటల సమయంలో హాస్టల్కు వచ్చిందని, హాస్టల్లో భోజనం లేకపోవడంతో ఆమె బంధువు భోజన పార్సిల్ తెచ్చి సెక్యూరిటీ చేతికి ఇచ్చారని విచారణలో వెల్లడైంది.
అనంతరం ఆమె హాస్టల్ గేట్ వద్దకు వచ్చి భోజన్ పార్సిల్ను తీసుకుని తన గదికి వెళ్లిపోయింది. ఈ సమయంలోనే ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. జులై 14న ఉదయం ఏం జరిగిందనే విషయాన్ని హాస్టల్లో ఉంటున్న ప్రతి విద్యార్ధిని అడిగి తెలుసుకుంటున్నారు.
రిషికేశ్వరి ఆత్మహత్యకు సంబంధంచి అంతక ముందు ముగ్గురు నిందితులు శ్రీనివాస్, జయచరణ్, అనీషాలను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. తాజా విచారణలో ఆ ముగ్గురితో పాటు మరో ఇద్దరు విద్యార్ధలు ప్రమేయం ఉన్నట్లు వెల్లడైందని భావిస్తున్నారు.
రిషికేశ్వరి తన సూసైడ్ నోట్ను మొత్తం ఐదు పేజీల్లో రాసింది. అయితే ఆ ఐదు పేజీల్లోని ఓ పేజీలో ఐదుగురు విద్యార్థుల పేర్లున్నాయి. రిషికేశ్వరి బ్లూ ఇంక్తో రాసిన పేర్లను బ్లూ ఇంక్ తోనే కొట్టేసి ఉండటం, వాటిపై రెడ్ ఇంక్తో ‘మిస్టర్ ఎక్స్' అని రాసి ఉండటం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.
తనను ర్యాంగింగ్ చేసిన వారి పేర్లను తానే స్వయంగా రాసిన రిషికేశ్వరి వాటిని కొట్టివేసి ఉంటే ‘మిస్టర్ ఎక్స్' అనే పేరును రెడ్ ఇంక్ తో ఎందుకు రాస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆత్మహత్య కేసులో ప్రిన్సిపాల్ బాబూరావు హస్తం ఉందా లేదా అనే కోణంలో కూడా ఎస్పీ దర్యాప్తుని ముమ్మరం చేశారు.
రిషికేశ్వరి హాస్టల్లోని తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె మృతదేహాన్ని చూసిన విద్యార్ధినులు ముందుగా ప్రిన్సిపాల్ బాబూరావుకు సమాచారం ఇచ్చారని నిజనిర్దారణ కమిటీకి విద్యార్ధులు వెల్లడించారు. అయితే పోలీసులు రాకుండానే రిషికేశ్వరి మృతదేహాన్ని ఎవరు ఆసుపత్రికి తరలించాలనే దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.
రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే, పోలీసులు రాకుండా ఆమె మృతదేహాన్ని ఎందుకు తరలించారు, ఎవరు తరలించమంటే తరలించారనే విషమయై పోలీసులు విద్యార్ధులను విచారిస్తున్నారు.