ఆర్థిక సాయం కోసం రాజీపడను, బాబురావు మాటేంటి: చంద్రబాబుకు రిషికేశ్వరి తండ్రి లేఖ
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి తండ్రి మురళీ కృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. కేసులో లోతుగా దర్యాఫ్తు చేసి వాస్తవాలను బయటకు తేవాలని విజ్ఞప్తి చేశారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరిని అరెస్టు చేయడం లేదన్నారు. సీనియర్లు ర్యాగింగ్ చేసి వేధిస్తున్న విషయం తెలిసి కూడా ప్రిన్సిపల్ బాబురావు పట్టించుకోలేదన్నారు. తన కూతురును వేధించిన శ్రీనివాస్తో ప్రిన్సిపల్ బాబురావు... రిషికేశ్వరికి మిస్ పర్ఫెక్ట్ అవార్డు ఇప్పించారన్నారు.
ఆత్మహత్య రోజున ముందుగా ప్రిన్సిపల్ బాబురావుకే సమాచారం అందిందని చెప్పారు. ఈ కేసు విషయంలో బాబురావును అందరు తప్పుపడుతున్నప్పటికీ ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. వార్డెన్ కన్నా ముందుగా ప్రిన్సిపల్ బాబురావు సంఘటన స్థలానికి చేరుకున్నారన్నారు.
నిందితులకు శిక్షణ పడేంత వరకు తాను తన కూతురు కేసులో పోరాడుతానని పేర్కొన్నారు. ఆర్థిక సాయం కోసం తాను ఎవరితోను రాజీపడేది లేదని తండ్రి మురళీ కృష్ణ తేల్చి చెప్పారు.
బాబురావు పాత్ర కనిపిస్తున్న కేకు నమోదు ఎందుకు చేయలేదని, రిషికేశ్వరితో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోలేదని, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఎందుకు తరలించారని, బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదికలో ర్యాగింగ్ జరిగిందని తేలినప్పటికీ బాబురావుపై కేసు ఎందుకు నమోదు చేయలేదని, బీఆర్క్ ఫ్యాకల్టీ డేవిడ్ రాజు గవర్నర్కు ఫిర్యాదు చేసినా లోతైన విచారణ ఎందుకు చేపట్టలేదని, పోలీసులు ఛార్జీషీటు వేయకమందే వీటిపై విచారణ జరిపి ప్రిన్సిపల్ పైన కేసు నమోదు చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
బెయిల్ పిటిషన్ కొట్టివేత
రిషికేశ్వరి మృతి కేసులో నిందితుల తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్ను జిల్లా సెషన్స్ కోర్టు గురువారం కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా అనీషా, జయచరణ్, శ్రీనివాస్ల బెయిల్ పిటిషన్ పైన కోర్టులో వాదనలు జరిగాయి. అయితే వీరి బెయిల్ పిటిషన్ను జిల్లా సెషన్స్ కోర్టు కొట్టివేసింది.