రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో సంచలనం: హైకోర్టు జోక్యం..విచారణకు డెడ్లైన్: ఆరు నెలల్లోగా..
గుంటూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసు విచారణను ముగించడానికి డెడ్లైన్ విధించింది. వచ్చే ఆరునెలల్లో కేసు విచారణను పూర్తి చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రత్యేక పోక్సో న్యాయస్థానానికి ఆదేశించింది. ఈ కేసు విచారణలో పోక్సో న్యాయస్థానం అనుసరించిన విధానాలు, విచారణ ప్రక్రియ సరిగ్గా లేదని అభిప్రాయపడింది. విచారణను వేగవంతం చేసేలా పోక్సో న్యాయస్థానానికి ఆదేశాలను ఇచ్చింది.
lockdown: లాక్ డౌన్ లో గుడిలో ప్రేమ పెళ్లి, అదే లాక్ డౌన్ లో ఆత్మహత్య, నెల రోజుల్లో ఏం జరిగింది ?
మళ్లీ పోక్సో న్యాయస్థానానికే కేసు..
రిషితేశ్వరి ఆత్మహత్య కేసు విచారణను ప్రత్యేక పోక్సో న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకునే సమయానికి రిషితేశ్వరి మేజర్ అయినందున ఈ కేసును తాము విచారించలేమని పోక్సో న్యాయస్థానం పేర్కొంది. మైనర్లపై చోటు చేసుకునే అత్యాచార కేసులను విచారించడానికి పోక్సో న్యాయస్థానం ఏర్పాటైంది. ఆత్మహత్య చేసుకునే సమయానికి రిషితేశ్వరి మేజర్ అని,, ఈ కేసు విచారణ తమ పరిధిలోకి రాదని, సంబంధిత న్యాయస్థానంలో దాఖలు చేసుకోవాలని పిటీషనర్లకు సూచించింది. పోలీసుల దాఖలు చేసిన ఛార్జిషీట్ను తిప్పి పంపించింది.
హైకోర్టులో సవాల్..
పోక్సో న్యాయస్థానం ఈ కేసు విచారణను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ రిషితేశ్వరి కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించారు. మరో పిటీషన్ను దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్ర రాయ్ విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకునే సమయానికి రిషితేశ్వరి మేజరా? మైనరా? అనే సందేహంతో పోక్సో న్యాయస్థానం విచారణను వేగంగా నిర్వహించట్లేదన్న పిటీషనర్ల వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు.
ఆత్మహత్య తేదీని ప్రాతిపదికగా.. ఎలా?
మైనర్లపై చోటు చేసుకునే అత్యాచారాలను విచారించడానికి ప్రత్యేకంగా పోక్సో న్యాయస్థానం ఏర్పాటైన విషయం తెలిసిందే. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకునే సమయానికి మేజర్ అయినందున.. తాము ఈ కేసును విచారించలేమంటూ పోక్సో న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసిందనే వాదనలను పిటీషనర్లు వినిపించినట్లు చెబుతున్నారు. ఆత్మహత్య తేదీని ప్రాతిపదికగా చేసుకుని మేజరా? లేదా మైనరా? అనే విషయాన్ని నిర్ధారించడం సరికాదని హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు లేదా.. లైంగిక వేధింపులకు గురైన తేదీని ప్రాతిపదికగా తీసుకోవాలని ఆదేశించారు.
ఛార్జిషీట్లో తేదీ ఆధారంగా..
ఈ ఛార్జిషీట్ను హైకోర్టు తిప్పి పంపించింది. మళ్లీ పోక్సో న్యాయస్థానంలోనే దాఖలు చేయాలని ఆదేశించింది. ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన కారణాలను వివరిస్తూ ఛార్జిషీట్లో పోలీసులు పొందుపరిచిన తేదీని ప్రాతిపదికగా తీసుకోవాలని హైకోర్టు సూచించింది. దీని ప్రకారం చూసుకుంటే.. అప్పటికి రిషితేశ్వరి మైనరే అవుతుందనే పేర్కొంది. దీని ప్రకారం.. ప్రత్యేక పోక్సో న్యాయస్థానం ఈ విచారణ చేపట్టాల్సి ఉంటుందని సూచించింది. ఆరు నెలల్లోగా విచారణను ముగించేయాలని ఉత్తర్వులను జారీ చేసింది.
Recommended Video
రాజకీయ దుమారం..
తెలంగాణలోని వరంగల్కు చెందిన రిషితేశ్వరి.. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని. మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ర్యాగింగ్, లైంగిక వేధింపుల గురి కావడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని పోలీసులు ఛార్జిషీట్లో నమోదు చేశారు. ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. 2015 జులై 14వ తేదీన ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిందితులను కాపాడుతోందంటూ విమర్శలు చెలరేగాయి.