ర్యాగింగ్ భూతం: రిషితేశ్వరి వంటి పరిస్థితిలోనే మరో అమ్మాయి
గుంటూరు: ర్యాగింగ్ భూతానికి బలైన రిషితేశ్వరి ఎదుర్కున్నటువంటి పరిస్థితినే నాగార్జున విశ్వవిద్యాలంయలో మరో విద్యార్థిని ఎదుర్కొంది. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ భూతం కొనసాగుతున్నట్లు తాజా సంఘటన తెలియజేస్తోంది.
ర్యాగింగ్ను తరిమికొడుతామని శపథం చేసినవాళ్లే ఇప్పుడు రిషితేశ్వరి ఎదుర్కున్న పరిస్థితినే మరో విద్యార్థినికి కల్పించిన సంఘటన వెలుగు చూసింది. రిషితేశ్వరి ఘటన తర్వాత వర్సిటీలో విద్యార్థి సంఘాల రద్దు, విద్యార్థి సంఘాల బోర్డుల తొలగింపు, ర్యాగింగ్ నిరోధిస్తూ బోర్డుల ఏర్పాటు వంటి చర్యలు తీసుకున్నారు.
టోల్ ప్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్ విధానం అమలు చేశారు. రెసిడెన్షియల్ వార్డెన్ల చేపట్టారు. అయినా ర్యాగింగ్ భూతం ఆగిపోలేదు. రిషితేశ్వరి ఆత్మహత్యకు దారితీసిన వారిని కఠినంగా శిక్షించాలని, ర్యాగింగ్ భూతాన్ని తరిమికొడతామని శపథం పూనిన రిషితేశ్వరి సహ విద్యార్థులు, రూమ్ మెట్స్ ర్యాగింగ్కు పాల్పడుతున్నట్లు వెలుగు చూసింది.
రిషితేశ్వరి ర్యాగింగ్ అంశంలో అనీషా అనే విద్యార్థిని పాత్రను రెండు రోజుల క్రితం మరో విద్యార్థిని శ్రీశ్వేత పోషించింది. శ్రీశ్వేత తమను మానసికంగా వేధిస్తున్నారని కొంత మంది జూనియర్ విద్యార్థులు రిజిస్ట్రార్ ఆచార్య రాజశేఖర్కు మౌఖికంగా ఫిర్యాదు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో రిజిస్ట్రార్ స్థానిక రెసిడెన్సీయల్ వార్డెన్స్తో నిఘా ఏర్పాటు చేయించారు. అదే సమయంలో శ్వేత జూనియర్ విద్యార్థినిని తన రూమ్కు పిలిపించుకొని వ్యక్తిగత పనులు చేయించుకుంటున్నట్లు తేలింది.
దీంతో రిజిస్ట్రార్ ఆచార్య రాజశేఖర్, ఆచార్య రాంబాబులు ప్రథమ, ద్వితీయ ఏడాది విద్యార్థులను పిలిపించి విచారించారు. అయితే వినితేశ్వర్, మంజుసాయినాథ్, ఆర్ శ్రీశ్వేత, బి మనోహర్ జీవన్రాజ్, జి సురేంద్రబాబులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్నారని తేలినట్లు వార్తలు వచ్చాయి.