రిషితేశ్వరి తల్లిదండ్రులకు ఇంటి స్థలం: శ్రీలక్ష్మి ఫ్యామిలీకి రూ. 10 లక్షలు
హైదరాబాద్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషితేశ్వరి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా ఇంటిస్థలం కేటాయించింది. బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి హామీ మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలోని మోరంపూడి గ్రామంలో ఆ స్థలాన్ని కేటాయించారు.
రిషితేశ్వరి తల్లిదండ్రులు మొండి దుర్గాభాయి, మొండి మురళీ కృష్ణలకు 500 గజాల స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి జేసీ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేర కు వెంటనే చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. మోరంపూడి గ్రామంలో గజం భూమి బేసిక్ ధర రూ.3,500 పలుకుతోంది.
ఇదిలావుంటే, హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్న శ్రీలక్ష్మి కుటుంబాన్ని ఆదుకునేందుకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మొత్తాన్ని అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్లోని రాంనగర్లో ఈ నెల 8న శ్రీలక్ష్మి అనే మహిళ తన భర్త వినోద్ కళ్లెదుటే ఆత్మహత్య చేసుకున్న సంగ తి తెలిసిందే. శ్రీలక్ష్మి భర్తకు వైద్యం అందించడంతోపాటు తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి నుంచి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
శ్రీలక్ష్మి భర్త వినోద్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. కాళ్లు చేతులు చచ్చుబడిపోవడంతో కొంతకాలంగా ఆయన మంచానికే పరిమితమయ్యారు. పూర్తిగా లేవలేని పరిస్థితిలో ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.