రిషితేశ్వరి ఆత్మహత్య కేసు: బాబూరావును తప్పించే ప్రయత్నం?
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషితేశ్వరి మృతికి ప్రధాన కారకుడిగా భావిస్తున్న అర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బాబూరావును తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయనపై గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులకు వర్సిటీ రిజిస్ట్రార్ ఈ నెల 6న చేసిన ఫిర్యాదు బుట్టదాఖలైనట్లు కనిపిస్తున్నది.
రిజిస్ట్రార్ ఫిర్యాదు నేపథ్యంలో బాబూరావుపై కేసు నమోదు కాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిషితేశ్వరి మృతి వెనుక మాజీ ప్రిన్స్పాల్ బాబూరావు పాత్రేమీ లేదనేవిధంగా చిత్రీకరించేందుకు పైస్థాయి అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ఏపీ పోలీసు ఉన్నతాధికారులపై కొందరు అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. రిషితేశ్వరి మృతికి ప్రిన్సిపాలే ప్రధాన కారకుడని నిజనిర్ధారణ కమిటీ, సుబ్రమణ్యం కమిటీలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో మరికొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఫ్రెషర్స్ డే పార్టీని ఉద్దేశపూర్వకంగానే హాయ్లాండ్లో ఏర్పాటు చేశారని గుర్తించారు. ఈ పార్టీకి నాలుగో సంవత్సరం విద్యార్థులు జయచరణ్, శ్రీనివాస్లను ప్రిన్స్పాల్ ఎందుకు తీసుకొచ్చారనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ పార్టీలో విద్యార్థులందరికీ బహుమతులు ఇచ్చిన బాబూరావు రిషితేశ్వరికి మాత్రం చరణ్తో ఇప్పించారనే అంశం వెలుగుచూసింది.
ఈ కేసులో ఇప్పటివరకు 28 మంది సాక్షులను పోలీసులు విచారించారు. ఈ కేసులో మొదటి ముద్దాయి దుంపా హనీషా, రెండో ముద్దాయి ధరావత్ జయచరణ్, మూడో ముద్దాయి నరాల శ్రీనివాస్ పాత్ర ఉన్నట్లు కొంతమంది తెలియజేసినట్లు సమాచారం. ర్యాగింగ్ పేరుతో వీరు రిషితేశ్వరిపై వికృత చర్యలకు పాల్పడినట్లు, మానసికంగా, శారీరకంగా, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.