బి అలెర్ట్:నదులకు పోటెత్తుతున్న వరద నీరు...నిండుకుండల్లా మారుతున్న జలాశయాలు
అమరావతి:ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని వివిధ జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. శ్రీకాకుళం, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లోని గొట్టా, శ్రీశైలం, తుంగభధ్ర జలాశయాలకు, ధవళేశ్వరం బ్యారేజీకి ఈ వరద నీరు భారీగా వచ్చి పడుతోంది.
ఓ వైపు వర్షాలు, మరో వైపు ఎగువున నుంచి వస్తున్న వరద ప్రవాహం రాష్ట్ర ప్రజలకు అటు ఆనందాన్ని ఇటు ఆందోళనను కలిగిస్తున్నాయి. పోటెత్తుతున్న వరద నీటితో పలు జిల్లాల్లోని జలాశయాలు నిండుకుండల్లా మారుతుండటం సంతోషమే అయినా వరద నీరు ఇంకా పెరిగితే ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఆందోళన మరోవైపు పీడిస్తోంది. ఏదేమైనా పెరుగుతున్న వరద నీటి తాకిడిని బట్టి అధికారులు అప్రమప్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
వంశధార గొట్టాపై...అధికారుల సమీక్ష
ఒడిశా రాష్ట్రం కాశీ నగర్కు చెందిన జలవనరులశాఖ ఇంజినీర్ సుధీర్ కుమార్సింగ్ వంశధార ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఆదివారం రాత్రికి 80 నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ విధంగా గొట్టా బ్యారేజీకి వచ్చిన వరద ఉధృతి నేపథ్యంలో పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ, భామిని వద్ద వంశధార నదీ పరివాహక ప్రాంతాన్ని పాలకొండ డిఎస్పి స్వరూపారాణి పరిశీలించారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు గ్రామాల్లో ఉండి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఈ వరద నీరు కారణంగా జిల్లాలో ఇప్పటికే వందలాది ఎకరాల పంటలు నీటమునిగాయి.
గోదావరికి వరద...పోలవరం పనులకు దెబ్బ?
గోదావరికి వరద నీరు పోటెత్తడంతో ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజ్ నుంచి 4.76 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. మరోవైపు వరద నీరు లంకలను చుట్టుముడుతోంది. ప్రస్తుతం గోదావరిలో ఇన్ఫ్లో ఏడు లక్షల క్యూసెక్కులు ఉండటంతో రాజమహేంద్రవరం, ధవళేశ్వరం ప్రాంతాల్లో గోదావరి ఉరకలేస్తోంది. పోలవరం నుంచి ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే మార్గంలో కొత్తూరు వద్ద కాజ్వే పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పోలవరం నుంచి ఎగువన ఉన్న 19 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పోలవరం తహశీల్దార్ సిహెచ్.రవికుమార్ ఆదివారం ఉదయం అక్కడికి చేరుకుని కొత్తూరు కాజ్వేపై వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ తాత్కాలికంగా రాకపోకలు సాగించేందుకు బోటు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గోదావరి నీటిమట్టం పెరగడం వల్ల పోలవరం ప్రాజెక్టులో పనులు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అంతకంతకూ పెరుగుతున్న... శ్రీశైలం నీటిమట్టం
కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుండి వరదనీటి ప్రవాహం కొనసాగుతుండడంతో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి ఎగువ జూరాల నుండి 1,86,050 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 41,360 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్లోకి వచ్చి చేరుతుంది. జలాశయ నీటిమట్టం క్రమంగా పెరుగుతూ 840.60 అడుగులకు చేరింది. మొత్తం నీటి నిలువ సామార్థ్యం 215.08 టిఎంసిలకు గాను ప్రస్తుతం 62.6860 టిఎంసిలుగా నమోదైంది.
తుంగభద్రకు...పోటెత్తింది
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్నూలు జిల్లాలో తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో అధికారులు 10 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం ప్రస్తుత ఇన్ఫ్లో 58,557 కాగా, ఔట్ఫ్లో 50,940 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం తుంగభద్ర జలాశయం నుంచి పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులకు గాను 1631. 23 అడుగులుకు చేరింది. అలాగే నీటినిల్వ 94.68 టీఎంసీలుగా నమోదు అయ్యింది.