జగన్ ప్రకటనతో చిక్కుల్లో ఆర్కే: ఎమ్మెల్యే సమాధానం చెప్పాలంటున్న రాజధాని రైతులు
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ,సీఆర్డీఏ చైర్మన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు జగన్ మూడు రాజధానుల ప్రకటనతో పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన ఏపీ రాజధానిగా మంగళగిరి పేరును ప్రతిపాదిస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు పరిపాలనా రాజధాని వైజాగ్ అని జగన్ చేసిన ప్రకటనతో ఆయన దిక్కు తోచని పరిస్థితిలో పడ్డారు. ఏపీ రాజధాని అమరావతి కంటే మంగళగిరి బెస్ట్ అన్న ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఇప్పుడు తాజాగా జగన్ చేసిన ప్రకటనపై మౌనంగా ఉన్నారు.
డైలమా లో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పరిస్థితి ముందు నుయ్య వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది. ఏపీ రాజధాని అమరావతిలో మంగళగిరిలోని కొన్ని గ్రామాలను సీడ్ కాపిటల్లో కలిపారు.జగన్ చేసిన ప్రకటన మంగళగిరి నియోజకవర్గంలోని రాజధాని గ్రామాల వాసులకు ఆగ్రహం తెప్పిస్తుంది. మంగళగిరి నియోజకవర్గంలో కూడా ప్రజల నుండి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. రాజధానిలోని 29 గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దీనికి సమాధానం చెప్పాలని ప్రజల నుండి డిమాండ్ వినిపిస్తుంది.
గతంలో రాజధానిగా మంగళగిరి అనుకూలం అని ప్రతిపాదించిన ఆర్కే
గత ప్రభుత్వం నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆర్కే ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంపైన కూడా మౌనంగా ఉండిపోయారు. ఇంతకు ముందు మంగళగిరిలో రాజధాని ఏర్పాటు చెయ్యాలని చెప్పిన ఆళ్ళ మంగళగిరి చాలా ఎత్తైన కొండ ప్రదేశం అని , ఇది గుంటూరు, విజయవాడ మధ్య ఉందని చెప్పారు. రాజధాని అమరావతితో పోలిస్తే దూరం కూడా చాలా తక్కువ అని పేర్కొన్నారు. అంతే కాదు జాతీయ రహదారులకు సమీపంలో ఉందని ఆయన పేర్కొన్నారు.దీని వల్ల రావాణా సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఇక మంగళగిరి ముంపుకు గురయ్యే చాన్స్ లేదన్నారు.
రాజధాని నిర్మాణానికి కావాల్సిన ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయని లెక్కలు
మంగళగిరిలో సుమారు 10వేల ఎకరాల ప్రభుత్వ స్థలాలు , అటవీ భూములు ఉన్నాయని ఆళ్ళ చెప్పారు. ఇక గతంలో శివరామ కృష కమిటీ నివేదిక అమరావతి రాజధాని నిర్మాణానికి అనుకూలం కాదని ఇచ్చినప్పటికీ గతప్రభుత్వం కమిటీ నివేదిక కు వ్యతిరేకంగా అమరావతిలో నిర్మాణం చేశారని పేర్కొన్నారు. భవిష్యత్ నిర్మాణాలు మంగళగిరిలో చేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళగిరి భారీ నిర్మాణాలకు అనుకూల ప్రాంతం అని ఆయన పేర్కొన్నారు.
ఆళ్ళ అనుకున్నది ఒకటి... అయ్యింది ఇంకొకటి
ఒకవేళ రాజధాని విషయంలో ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ అభిప్రాయం అడిగితే కచ్చితంగా మంగళగిరి పేరును ప్రతిపాదిస్తానని మంగళగిరి ఎమ్మెల్యే, సీఆర్ డీఏ చైర్మన్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.కానీ ఇప్పుడు ఆళ్ళ చెప్పిన దానికి, జరుగుతున్న దానికి ఏ మాత్రం సంబంధం లేకుండా పోయింది. పరిపాలన రాజధానిని తరలించాలన్న ప్రతిపాదనను జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా ఆర్కే మౌనంగా ఉండిపోతున్నారు.
ఆర్కేపై ఒత్తిడి .. ఆర్కే మిస్సింగ్ అని ఫిర్యాదు
ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తం కాగా ,టీడీపీ కూడా ఆయనపై ఎదురుదాడి మొదలుపెట్టింది. ఆర్కే కనిపించటం లేదంటూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు రైతులు. ఇంతాజరుగుతున్నా ఆర్కే రాలేదని , ఏమి మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి మండలంతో పాటు, తాడేపల్లిలోని మరికొన్ని గ్రామాలు సీడ్ క్యాపిటల్ పరిధిలోనే ఉన్నాయి. గతంలో రాజధానిలో అవినీతి జరిగిందని గట్టిగా మాట్లాడిన ఆర్కే, మంగళగిరిని రాజధాని చెయ్యాలని తన వాదన వినిపించిన ఆర్కే ప్రజల ఆగ్రహావేశాలు చల్లారే వరకూ మౌనంగా ఉండాలని భావిస్తున్నారు. నియోజకవర్గ ప్రజల వద్దకు వెళ్ళలేని పరిస్థితిలో సైలెంట్ గా చూస్తున్నారు.