ఆర్కే చంద్రబాబును వదలరా .. కోర్టులో టీడీపీ టార్గెట్ గా మరో కూల్చివేతకు పిటీషన్
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ టీడీపీ టార్గెట్ గా పని చేస్తుంది. చంద్రబాబును ఇరకాటంలో పెట్టటమే ధ్యేయంగా పని చేస్తుంది . ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేస్తూ అన్ని విషయాల్లోనూ ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.
Vijayawada: లోకల్ హీట్: గద్దె రామ్మోహన్ కు చెక్ పెట్టడానికి దేవినేనిని దించిన వైసీపీ..!
టీడీపీ ప్రధాన కార్యాలయ కూల్చివెయ్యాలని కోర్టును ఆశ్రయించిన ఆర్కే
ఇటీవల గత ప్రభుత్వ హయాంలో అత్యంత విలువైన భూములను అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అతి తక్కువ ధరకు టీడీపీకి కేటాయించిందని , ఇక దానిని రద్దు చేయాలని ఒక వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే ప్రభుత్వానికి లేఖ రాశారు. టిడిపి ప్రధాన కార్యాలయం కోసం చేసిన భూకేటాయింపు ఉత్తర్వులను రద్దుచేయాలని కోరుతూ వారు వేర్వేరుగా ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. అయితే ఇప్పటికే అక్కడ టీడీపీ ప్రధాన కార్యాలయ నిర్మాణం జరిగింది .ఇక దానిపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కోర్టుకు వెళ్ళారు.
టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబుకు ఆర్కే షాక్
ఇక నిన్న గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం అత్మకూరు పరిధిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంను చంద్రబాబు ప్రారంభించారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ మాజీ మంత్రి లోకేష్ దంపతులు పాల్గొన్నారు. కార్యాలయం ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు చేపట్టి పార్టీ జెండాను చంద్రబాబు ఎగురవేశారు. కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే సమయంలో చంద్రబాబుకు షాక్ ఇస్తూ ఆ భవనాన్ని కూల్చివెయ్యాలని , ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోర్టులో పిటీషన్ వేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి .
అక్రమ నిర్మాణం,నిబంధనలు పాటించలేదన్న ఆర్కే
గుంటూరు జిల్లా ఆత్మకూరులో నిర్మితమైన టీడీపీ ప్రధాన కార్యాలయ భవనం అక్రమ నిర్మాణమని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా దానిని నిర్మించారని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆత్మకూరు పరిధిలో ఉన్న వాగు పోరంబోకుకు చెందిన సర్వే నెంబరు 392లో 3.65 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం 99 సంవత్సరాల పాటు లీజుకిస్తూ 2017లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఆయన తన పిటీషన్లో పేర్కొంటూ ఇది అక్రమమని కోర్టుకు నివేదించారు .
ప్రతివాదులుగా చంద్రబాబుతో పాటు నాడు ఆ భూమి లీజుకు ఇచ్చిన అధికారులు
టీడీపీ కార్యాలయం వివాదస్పద భూమిలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని దానిని వెంటనే తొలగించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కోర్ట్లో పిటీషన్ దాఖలు చెయ్యటమే కాదు ఈ పిటీషన్లో ప్రతివాదిగా చంద్రబాబు పేరును పెట్టారు. అయితే ఈ పిటీషన్పై కోర్ట్ సోమవారం విచారణ చెయ్యనుందని తెలుస్తుంది . ఇక ఇందులో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ కార్యదర్శి, ఏపీ సీఆర్డీఏ కమిషనర్, జిల్లా కలెక్టర్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తదితరులను ప్రతివాదులుగా చేర్చిన ఆయన గట్టిగానే ఫైట్ చెయ్యనున్నారు .
టీడీపీ ప్రధాన కార్యాలయ భూమిపై కొనసాగుతున్న దుమారం
గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన అవినీతిని బట్టబయలు చేసేందుకు కంకణం కట్టుకుంది. ఇక అంతే కాదు తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం గుంటూరు జిల్లాలో కేటాయించిన భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి లేఖలు రాస్తూ వైసీపీ నేతలు టీడీపీని ఇబ్బంది పెడుతున్నారు . గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని 3.65 ఎకరాల భూమిని టీడీపీ ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం కేటాయిస్తూ 2017 జూన్ 22న ప్రభుత్వం ఉత్తర్వులు జీవో 228 జారీ చేసింది. ఈ భూమిని 99 ఏళ్లపాటు లీజు ప్రాతిపదికన నాటి ప్రభుత్వం కేటాయించింది. ఏటా ఎకరానికి రూ.1000 లీజు ఫీజుగా నిర్ణయించి జరిపిన భూ కేటాయింపు పై ఇప్పుడు దుమారం రేగింది.