‘పవన్! మీకు వచ్చింది ఒకే సీటు.. చంద్రబాబు ఉచ్చులో పడొద్దు’
చిత్తూరు: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా విమర్శల వర్షం కురిపించారు. పెయిడ్ ఆర్టిస్టులతో ఆడిన డ్రామాలు బయటపడటంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ను రంగంలోకి దింపారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.
ముందు నుంచీ..
ఆదివారం రోజా మీడియాతో మాట్లాడుతూ.. నాటి నుంచి నేటి వరకు పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు అనుకూలంగానే పనిచేస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్లపాటు చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి పవన్ కళ్యాణ్కు కనిపించలేదా? అని ప్రశ్నించారు.
ఒక్క సీటే వచ్చింది..
ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న పవన్ కళ్యాణ్ ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వంద రోజుల్లో జరిగిన అభివృద్ధి కనబడటం లేదా? అని నిలదీశారు. పవన్ కళ్యాణ్.. చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆరోపించారు.
అవినీతిని సమర్థిస్తారా?
ఇది ఇలా ఉండగా, ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్పై విమర్శలు ఎక్కుపెట్టారు. అమరావతి, పోలవరంలో అవినీతి జరిగిందనే తాము చెబుతున్నామని, అవినీతిని పవన్ కళ్యాణ్ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ ఎలా జరిగిందో పవన్ కు తెలియదా? అని నిలదీశారు.
టీడీపీలో ఉచ్చులో పడొద్దు..
వైసీపీ 100 రోజుల పాలనపై జనసేన నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో మంత్రి అవంతి మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక విధానం సరిదిద్దే ప్రయత్నంలో కాస్త ఆలస్యం అవుతోందని అన్నారు. టీడీపీ ఉచ్చులో పడొద్దని పవన్ కళ్యాణ్కు మంత్రి సూచించారు.