ఫుట్ పాత్ పైనే.. పవన్ దుమ్ము దులిపేసిన రోజా
హైదరాబాద్ : ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తూ.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడలో ఇచ్చిన స్పీచ్ పై ప్రతిపక్షం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. పవన్ కళ్యాణ్ లో ఉన్నదంతా అవగాహన రాహిత్యమేనని చెప్పుకొచ్చారు.
మూడో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్బంగా.. సభ వాయిదా అనంతరం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందున్న ఫుట్ పాత్ పై కూర్చున్న రోజా వైసీపీ అధినేత జగన్ తో కలిసి ఆందోళనకు దిగారు. ఫుట్ పాత్ పైనే మీడియాతో మాట్లాడిన రోజా.. పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ తన వ్యాఖ్యలతో పవన్ దుమ్ము దులిపేశారు.
పవన్ కళ్యాణ్ మనస్తత్వం చిన్నపిల్లల్లాంటిదన్న రోజా.. పవన్ స్పీచ్ ను అవగాహన రాహిత్యం కిందే లెక్కగట్టారు. ప్రత్యేక హోదాపై పవన్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్న రోజా.. మోడీ , చంద్రబాబులను హోదా గురించి డిమాండ్ చేయాల్సిందిగా పవన్ ను డిమాండ్ చేశారు. టీడీపీ బీజేపీల మేనిఫెస్టోలను చూడకుండానే పవన్ వాళ్ల తరుపున ప్రచారం చేశారా అని ప్రశ్నించారు రోజా. ఏపీ ప్రజల చెవిలో కేంద్రం పూలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.