లోకేష్ లీడరా? అదే భయం, అందుకే బీజేపీ మంత్రి భార్యకు పదవి: బాబుపై రోజా షాకింగ్
చిత్తూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం నిప్పులు చెరిగారు. బాబు ధర్మపోరాటం అంతా డ్రామా అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఉరి తీసిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. బీజేపీతో లాలూచీకి టీడీపీ తహతహలాడుతోందన్నారు.
చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం టీటీడీ బోర్డును వినియోగించుకున్నారని చెప్పారు. తనపై విచారణ వేస్తారని చంద్రబాబు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. అందుకే బీజేపీ మంత్రి భార్యకు టీటీడీ బోర్డు పదవి ఇచ్చారని చెప్పారు.
బాబు-లోకేష్లు రూ.4 లక్షల కోట్లు దోచుకున్నారు
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు రూ.4 లక్షల కోట్లు దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజలను కాపాడలేని చంద్రబాబు తనను రక్షించాలని కోరుతున్నారన్నారు. జయంతికి-వర్ధంతికి, దేశానికి-రాష్ట్రానికి తేడా తెలియని వ్యక్తి లోకేష్ అన్నారు. లోకేష్ను ఎవరు కూడా లీడర్గా గుర్తించడం లేదన్నారు.
నాలుగేళ్లు మంత్రి పదవులు అనుభవించి
ప్రత్యేక హోదా గురించి నాలుగేళ్లు మాట్లాడకుండా ఉన్న చంద్రబాబు ఇప్పుడు దీక్ష చేస్తామని చెప్పడం విడ్డూరమని రోజా అన్నారు. దీక్షల పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. కేంద్రంలో మంత్రి పదవులను నాలుగేళ్ల పాటు అనుభవించి, విభజన చట్టంలోని హామీలను అమలు చేసేలా చేయడంలో టీడీపీ విఫలమైందన్నారు.
కాళ్లు పట్టుకొని జగన్పై కుట్ర
సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టిన చంద్రబాబు నమ్మకద్రోహి అన్నారు. హోదా కోసం నాలుగేళ్లుగా వైసీపీ చేసిన ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబుది ధర్మపోరాటమో లేక దగా పోరాటమో ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని చిదంబరం, సోనియా కాళ్లు పట్టుకొని జగన్పై కుట్ర పన్నారన్నారు.
బాబు కుట్రల గురించి మాట్లాడితే ముక్కున వేలు
చంద్రబాబు పక్క రాష్ట్రంలోని ఎమ్మెల్సీలను కూడా కొనుగోలు చేయాలని ప్రయత్నించారని రోజా అన్నారు. అలాంటి బాబు కుట్రల గురించి మాట్లాడటం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. విజయవాడలో చంద్రబాబు చేసిన 12 గంటల ధర్మ పోరాట దీక్ష ఆడియో ఫంక్షన్లా ఉందన్నారు. మళ్లీ తిరుపతిలో 30న చేసే దీక్షతో ప్రజలను ఫూల్స్ చేయాలనుకుంటున్నారన్నారు.
అదీ మా సంప్రదాయం
ఇటీవల కన్నుమూసిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు స్థానంలో పోటీ పెట్టవద్దని తాము భావిస్తున్నామని చెప్పారు. పదవిలో ఉన్నప్పుడు చనిపోతే పోటీ పెట్టకుండా ఉండటం తమ పార్టీ సంప్రదాయం అని చెప్పారు. రేపు దీక్ష పేరుతో అధికార పార్టీ చేసేది టీడీపీ నేతలకు ఫూల్స్ డే అన్నారు.