క్షుద్రపూజలతో గెలవాలనుకుంటే, టీడీపీలోకి రావాలని ఒత్తిడి: బాబుపై రోజా, ధర్మాన
Recommended Video
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై, టిడిపి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, ఆ పార్టీ నేత ధర్మాన ప్రసాద రావు శుక్రవారం నిప్పులు చెరిగారు. పార్టీలో చేరాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేశారు.
రోజా మాట్లాడుతూ.. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తిని మంత్రిని చేశారని నారా లోకేష్ను ఉద్దేశించి అన్నారు. ఓటుకు నోటు కేసులో ఏపీని తాకట్టు పెట్టారని చంద్రబాబుపై విమర్శలు చేశారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు.
పవన్ను అంత మాట అంటావా: కత్తి మహేష్కు దిమ్మతిరిగేలా, తిడుతున్నారంటూ పోస్ట్
క్షుద్రపూజలు చేసి గెలవాలనుకుంటే
ముఖ్యమంత్రి చంద్రబాబు క్షుద్రపూజలు చేసి మళ్లీ గెలవాలని చూస్తున్నారని రోజా విమర్శించారు. అలా గెలవాలని చూస్తే ప్రజలు ఏమాత్రం ఒప్పుకోరని చెప్పారు. చంద్రబాబు సొంత జిల్లాను పట్టించుకోలేదని ఇక రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆయన సొంత జిల్లాకు ఒక్క పరిశ్రమను తేలేకపోయారని చెప్పారు. చంద్రబాబుది మోసపూరిత పాలన అన్నారు. ఉద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారన్నారు.
అర్జీలను చెత్తబుట్టలో పడేసి
పదేపదే ప్రజలను మోసం చేస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి పేరుతో మరో మోసపూరిత కార్యక్రమానికి తెరలేపారని మరో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గతంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను చెత్తబుట్టల్లో పారేసి, ఇప్పుడు కొత్తగా సాధించేదేమిటని ప్రశ్నించారు. జన్మభూమి కార్యక్రమం జాదూభూమిగా మారిందన్నారు.
మీ గ్రామాల గురించి ఆలోచించండి
జన్మభూమి పేరుతో అధికారులు, స్కూల్ పిల్లలను ఇబ్బందిపెడుతున్నారని ఆళ్ల ఆరోపించారు. ఎవరి గ్రామాన్ని వాళ్లే అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు అంటున్నారని, మరి మీ నారావారిపల్లె సంగతి ఏమిటని చంద్రబాబును ప్రశ్నించారు. అక్కడి స్కూల్ భవనం కూలడానికి సిద్ధంగా ఉందని, లోకేష్ దత్తత తీసుకున్న నిమ్మకూరులో వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరిందని విమర్శించారు.
సొంత ఊళ్లను పట్టించుకోవట్లేదు కానీ
కనీసం సొంత ఊళ్లను కూడా పట్టించుకోని చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా? అని ప్రశ్నించారు. మీ అబద్ధాలను ప్రజలు నమ్మాలా అన్నారు. ఇప్పటికైనా ఆ రెండు ఊళ్లకు న్యాయం చేయాలని, ఆ తర్వాత మిగతా గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడాలన్నారు.
టీడీపీలోకి రావాలని ఒత్తిడి
తెలుగుదేశం ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళంలో మండిపడ్డారు. తాము ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతుంటే ముఖ్యమంత్రి ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. టీడీపీలోకి రావాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.