లోకేష్ మామూలు పప్పు కాదు, విటమిన్ లేని..: రోజా, ‘కేసీఆర్ కాళ్లు పట్టుకోడానికే దేవినేని’
Recommended Video
హైదరాబాద్: ఏపీ మంత్రి నారా లోకేష్పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రోజా గురువారం మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ నిజంగా పప్పు అని మరోసారి రుజువు చేసుకున్నారని రోజా వ్యాఖ్యానించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా పోయిందని రోజా అన్నారు.
విటమిన్ లేని.. గన్నేరుపప్పు
కంపెనీలు తెచ్చామని లోకేష్ గొప్పులు చెబుతున్నారనీ, కేంద్ర ప్రభుత్వ పరిదిలోకి వచ్చే వాటిని కూడా తమ ఖాతాలో వేసుకున్న లోకేష్ను పప్పు అని కాకుండా ఏంకేమని పిలవమంటారని రోజా ప్రశ్నించారు. పప్పు అంటే విటమిన్ ఉన్న పప్పు అనుకున్నారు, కానీ అది గన్నేరు పప్పు అని ఏపీ సీఎం చంద్రబాబుకు త్వరలోనే తెలుస్తుందని అన్నారు.
పచ్చ పత్రికలు ఇలా...
గత నాలుగేళ్లలో నిర్వహించిన పారిశ్రామిక సదస్సుల్లో 20లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని లోకేష్ గొప్పలు చెబితే పచ్చ పత్రికలు అదే విషయాన్ని రాశాయని అన్నారు. కానీ, కేవలం 16,900కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని నివేదికల్లో తేలిందన్నారు.
కేసీఆర్ కాళ్లు పట్టుకోవడానికి దేవినేని..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీకి వస్తే ఆయన కాళ్లు పట్టుకోవడానికి మంత్రి దేవినేని ఉమాను చంద్రబాబు పంపారని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆడా.. మగా ఎవరు అని దేవినేనిని కేసీఆర్ ప్రశ్నించారని చెప్పారు.
టీటీడీని భ్రష్టు పట్టించారు
కళా వెంకట్రావు లేఖలో ప్రతి లైన్కు వివరణ ఇస్తామని రోజా తెలిపారు. టీటీడీని భ్రష్టు పట్టించింది చంద్రబాబేనని, సంబంధం లేని వ్యక్తులను టీటీడీలో చేర్చి శ్రీవారి ఆగ్రహానికి గురైంది కూడా చంద్రబాబేనని అన్నారు. పొరుగురాష్ట్ర బీజేపీ మంత్రి భార్యను టీటీడీ బోర్డులో సభ్యురాలిని చేశారని అన్నారు.
రమణ దీక్షితులను అందుకే తొలగించారు
నాలుగేళ్లు బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేసింది టీడీపీనేనని, ఏ రోజూ తాము బీజేపీతో కలవలేదని, కలుస్తామని చెప్పలేదని రోజా అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వస్తే రమణదీక్షితులు వెళ్లారని ఆయనను ప్రధాన అర్చకులు పదవి నుంచి తొలగించారని మండిపడ్డారు. జగన్పై అవినీతి ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు ఎందుకు నిరూపించడం లేదని రోజా నిలదీశారు.