ఎట్టకేలకు దిగొచ్చిన రోజా: ‘సారీ’ అంటూ స్పీకర్కు లేఖ, అనితకు కూడా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ ముద్రవేసుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎట్టకేలకు దిగొచ్చారు. గతంలో అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా బేషరతు క్షమాపణ చెప్పారు. అసెంబ్లీలో సభానాయకుడు నారా చంద్రబాబునాయుడు, సభాధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాద్ లపై నిండు సభ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.
'సారీ' చెబితే వదిలేస్తామన్న సర్కారు ఫీలర్లకు ససేమిరా అన్న రోజా... ఇటు హైకోర్టులోనే కాకుండా అటు సుప్రీంకోర్టులోనూ న్యాయ పోరాటం చేశారు. అయితే ఎక్కడా ఆమెకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో చివరకు సారీ చెప్పేందుకే నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆమె సారీ చెప్పేశారు.
ఈ మేరకు లిఖితపూర్వంగా రోజా రాసిన క్షమాపణ లేఖ గురువారం స్పీకర్ కార్యాలయానికి చేరింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా రోజా వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే అనిత నిండు సభ సాక్షిగా కంట తడి పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కూడా రోజా తన క్షమాపణ లేఖలో ప్రస్తావించారు.
అంతేగాక, నాడు తాను చేసిన వ్యాఖ్యలు అనితను బాధించి ఉంటే... ఆమెకు కూడా సారీ చెబుతున్నట్లు రోజా సదరు లేఖలో పేర్కొన్నారు. కాగా, అనిత ఫిర్యాదుపై శుక్రవారం జరగాల్సిన సభా హక్కుల సంఘం సమావేశం, సభ్యులు అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది.