తెలంగాణకు సంబరమే! మరి మీకెందుకు?: చంద్రబాబుపై రోజా సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు చంద్రబాబు ప్రారంభించినది నవ నిర్మాణ దీక్ష కాదని.. నారావారి నయవంచన దీక్ష అని ఎద్దే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు చంద్రబాబు ప్రారంభించినది నవ నిర్మాణ దీక్ష కాదని.. నారావారి నయవంచన దీక్ష అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రం విడిపోయి ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే.. చంద్రబాబునాయుడు మాత్రం నవ నిర్మాణ దీక్షతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని రోజా విమర్శించారు. అవినీతిపై పోరాటం చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మిలీనియం జోక్ అంటూ ధ్వజమెత్తారు.
ఇంతవరకు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేసి చెప్పగలరా? అని చంద్రబాబుకు రోజా సవాల్ విసిరారు. రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకోవడంలో అర్థం ఉంటుందన్న రోజా.. అడ్డగోలుగా ఏపీని విభజించిన తర్వాత చంద్రబాబు దీక్ష పేరుతో సంబరాలు చేసుకోవడం ఏంటని రోజా నిలదీశారు.
పబ్లిసిటీ కోసమే చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు పరిపాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, మూడేళ్ల ఆయన పాలన ప్రజావ్యతిరేక విధానాలతో ముందుకెళ్లిందని ధ్వజమెత్తారు. మిత్రపక్షమే ఛీకొట్టిన ఈ ప్రభుత్వం నవనిర్మాణ దీక్ష ఎందుకు చేస్తోందని నిలదీశారు. టీడీపీతో జతకట్టడాన్ని 'భస్మాసుర పొత్తు' అని బీజేపీ నేతలే అంటున్నారని చెప్పారు.
ఇసుక నుంచి రాజధాని వరకు అంతా అవినీతేనని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అవినీతి సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. దీక్షల పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్న చంద్రబాబును తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
బాబు అవినీతిపై విచారణ జరిపితే ఆయనకు వెయ్యేళ్ల జైలుశిక్ష పడుతుందన్నారు. బాబు చేసిన పాపాలను కడుక్కోవడానికి జగన్ నామస్మరణ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. లోకేశ్ సవాళ్లు మహేష్బాబు సినిమా డైలాగుల్లా ఉన్నాయని విమర్శించారు.