బాబు ‘ఆనందం’! ఎన్నికలకు సిద్ధమా?: రోజా సవాల్, ‘పవన్ను అభినందించాల్సిందే’
Recommended Video
హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేతలు, సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బీజేపీతో తాము కుమ్మక్కైతే తమ పార్టీ ఎంపీలు ఢిల్లీలో ఎందుకు ఆమరణ దీక్ష చేస్తారని ప్రశ్నించారు. తమ పార్టీ ఎంపీలను విమర్శించే అర్హత టీడీపీకి లేదని అన్నారు.
బుధవారం రోజా మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రమంతటా ఆందోళనలు, ఆగ్రహావేశాలు పెల్లుబిగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆనంద నగరాలు పేరుతో వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇలాంటి పనికిమాలిన కార్యక్రమానికి తెలుగువారైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకావడం విడ్డూరంగా ఉందన్నారు.
ఎందుకు ఆనందం?
‘టీడీపీ ప్రభుత్వ పథకాలపై 71శాతం సంతృప్తి ఉందట! రుణమాఫీ కాక రైతులు అప్పులపాలైనందుకా, ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా రానందుకా, ఇంటికో ఉద్యోగం, దళితులకు ఇళ్లు దక్కనందుకా? ఏ విషయంలో జనం సంతృప్తిగా ఉన్నారు?' అని రోజా నిలదీశారు. నాడు వైఎస్సార్ అంటే ఆరోగ్యశ్రీ, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత కరెంట్ లాంటి పథకాలు గుర్తొచ్చేవని, మరి చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. హోదా అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఆనంద నగరాలంటూ మరో నాటకం ఆడుతున్నారని రోజా మండిపడ్డారు.
బాబుకు రోజా సవాల్
ఏ ముఖ్యమంత్రి పాలననైనా ప్రజలు పొగుడుతారు కానీ చంద్రబాబు మాత్రం తనను తానే పొగుడుకుంటారని రోజా ఎద్దేవా చేశారు. ప్రజలంతా బాధల్లో ఉంటే ఈయనేమో ఆనందనగరి అని వేడుకలు చేస్తారా? అని మండిపడ్డారు. చంద్రబాబు అన్నట్లు ప్రజలంతా సంతోషంగా ఉంటే వెంటనే ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసి.. ఎన్నికలకు వెళదామని, ఇందుకు టీడీపీ సిద్ధమేనా? అని రోజా సవాల్ విసిరారు.
టీడీపీ ఎంపీలను తరిమికొట్టాలి
‘ఏపీకి చెందిన అందరు ఎంపీలూ రాజీనామాలు చేసి ఉంటే ఈపాటికి కేంద్రం దిగివచ్చేది. కానీ చిత్తశుద్దిలేని చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామాలు చేయించరు. ఢిల్లీలో డ్రామాలు చేసి, రాజీనామాలు చేయకుండా వచ్చిన టీడీపీ ఎంపీలను ప్రజలంతా తరిమికొట్టాలి. నాడు సమైఖ్యాంద్ర ఉద్యమంలో భాగంగా నందమూరి హరికృష్ణతో రాజీనామా చేయించిన చంద్రబాబు.. ఇవాళ తన బినామీ సుజనా చౌదరితో ఎందుకు చేయించలేదు?' అని రోజా నిలదీశారు.
ఆకాశానికి అవినీతి, అక్రమార్జన
‘హోదా కోసం ఆందోళనలు చేస్తోన్న వైసీపీ కార్యకర్తలను పోలీసులతో అడ్డగించడం సిగ్గుచేటుకాదా? మీరు 30 సార్లు ఢిల్లీకి వెళ్లింది ఓటుకు నోటు కేసు, నియోజకవర్గాల పెంపు కోసం కాదా?' రోజా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారమే పరమావధి తప్ప, మరో ఆలోచన లేదని అన్నారు. రాజధానిలో నాలుగేళ్లలో కనీసం నాలుగు అంతస్తుల భవనం కూడా కట్టలేని తెలుగు దేశం ప్రభుత్వం అక్రమార్జనలో మాత్రం ఆకాశాన్ని దాటిపోయిందని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. భూములు కోల్పోయిన రైతుల కన్నీళ్లతో అమరావతిని స్యాడ్ కాపిటల్ మార్చారని చంద్రబాబుపై మండిపడ్డారు.
పప్పు సార్వభౌమ అంటూ లోకేష్పై
‘11 మంది మంత్రుల పనితీరు భేష్ అని సీఎం అంటున్నారు. అవునుమరి.. ఒక్క రోడ్డు కూడా వేయలేని సీఎం కొడుకు నారా లోకేష్.. విశ్వవిఖ్యాత పప్పు సార్వభౌమకు, విచ్చలవిడిగా బార్లు పెట్టి మహిళల జీవితాలను నాశనం చేస్తోన్న ఇతర మంత్రులకు ఈ కితాబు దక్కాల్సిందే! నాలుగేళ్లపాటు ఏకపక్షంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఇవాళ అఖిలపక్షం భేటీకి పిలిస్తే ఏఒక్కరూ వెళ్లని పరిస్థితి' అని రోజా ఆరోపించారు. లోకేష్ మామ బాలకృష్ణ నియోజకవర్గంలో నీటి కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా పట్టించుకోవడం లేదని అన్నారు.
పవన్కు అభినందనలు
టీడీపీ ప్రభుత్వం హయాంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని రోజా ఆరోపించారు. చంద్రబాబు ఏప్రిల్ 30న తిరుపతిలో సభ పెట్టి కేంద్రాన్ని నిలదీస్తామంటూ కొత్త నాటకానికి తెరతీస్తున్నారని రోజా మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తానన్న పవన్.. ఇటీవల ప్రత్యేక హోదా కోసం 2కి.మీల పాదయాత్ర చేయడం అభినందనీయమని అన్నారు. ఈ పోరాటాన్ని ఆయన కొనసాగిస్తే మంచిదని రోజా వ్యాఖ్యానించారు. కీలక పదవుల్లో ఉండికూడా వెంకయ్య నాయుడు ప్రధానిని ఏపీకి ప్రత్యేక హోదా గురించి అడగరని, అలాగే సీఎం చంద్రబాబు.. వెంకయ్యను హోదా గురించి అడగరని అన్నారు.