జగన్ మూడు రాజధానులకే ఆర్కే మద్దతు .. షాక్ లో రాజధాని అమరావతి రైతులు
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ,సీఆర్డీఏ చైర్మన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు జగన్ తీసుకున్న రాజధాని వికేంద్రీకరణ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన ఏపీ రాజధానిగా మంగళగిరి పేరును ప్రతిపాదిస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంతో ఏకీభవవించినట్టు తాజా పరిణామాలతో అర్ధం అవుతుంది. దీంతో రాజధాని రైతులు షాక్ కు గురయ్యారు.
అధికార వికేంద్రీకరణకు అనుకూలంగా ఆర్కే ర్యాలీ యత్నం
రాజధాని అమరావతిలో రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతుంటే ఎమ్మేల్యే ఆర్కే ఇప్పటి వరకు తన అభిప్రాయం వెల్లడించలేదు. అయితే అధికార వికేంద్రీకరణకు మద్దతుగా సోమవారం పెనుమాక నుంచి ర్యాలీ చెయ్యటానికి ఆయన ప్రయత్నం చెయ్యటంతో ఆయన కూడా జగన్ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నట్టు అర్ధం అవుతుంది . ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా రాజధాని అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదని, భూములు ఇచ్చిన వారికి కూడా ప్లాట్లు ఇవ్వలేదన్నారు.
చంద్రబాబుపై విరుచుకుపడిన ఆర్కే ..
రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకముందే ప్రతిపక్ష నేత చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాజధాని విషయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల సాక్షిగా అధికార వికేంద్రీకరణ జరగాల్సిందే, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాల్సిందేనని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు. గతంలో తాను చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రాజధాని ముసుగులో చంద్రబాబు విషప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు.
రాజధానిలో అలజడులు సృష్టిస్తుంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లేనన్న ఎమ్మెల్యే
రాజధానిలో అలజడులు సృష్టిస్తుంది టీడీపీ వారు సృష్టించిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లేనని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తప్పులను, దళితులకు చేసిన అన్యాయాన్ని బయటకు రాకుండా చూసుకోవడానికి టీడీపీ కార్యకర్తలు రాజధాని గ్రామాల్లో అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.ఇక అంతే కాదు ఇంకా హైపవర్ కమిటీ నివేదికలు ఇవ్వకుండానే ఇంత అరాచకం చెయ్యటం చంద్రబాబుకే సాధ్యం అని ఆయన మండిపడ్డారు. లక్షల కోట్లు దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు.
మూడు రాజధానుల ప్రకటనకు మద్దతుగా ఆర్కే .. షాక్ లో రాజధాని రైతులు
ఇక సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చెయ్యటం టీడీపీ నాయకులకే చెల్లిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఒక పక్క రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నా ఇన్నాళ్ళ పాటు నోరు మెదపని ఆర్కే ఈ రోజు మూడు రాజధానుల ప్రకటనకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారంటే ఆయన జగన్ నిర్ణయానికే కట్టుబడినట్టు అర్ధం అవుతుంది. మొదట నుండి ఆర్కే నిర్ణయం చెప్పాలని డిమాండ్ చేసిన రైతులకు ఆర్కే ఈ రోజు ర్యాలీ నిర్వహణా ప్రయత్నం షాక్ కు గురి చేసిందని చెప్పాలి. ఆర్కే నిర్ణయం అర్ధం అయ్యేలా చెప్పింది.