తాగేసి, బ్రేక్ కు బదులు ఎక్స్ లేటర్ తొక్కిన టిడిపి లీడర్: ఒకరి మృతి
రోడ్డు పక్కన మంచాలపై నిద్రిస్తున్న వారిపై కారు దూసుకెళ్ళి భీభత్సం సృష్టించింది. భీమవరం పట్టణానికి చెందిన 38 వ, వార్డు కౌన్సిలర్ పిల్లి క్లేరా భర్త పిల్లి ముసలయ్య నడిపిన కారు భీభత్సం సృష్టించింది.
భీమవరం: రోడ్డు పక్కన మంచాలపై నిద్రిస్తున్న వారిపై కారు దూసుకెళ్ళి భీభత్సం సృష్టించింది. భీమవరం పట్టణానికి చెందిన 38 వ, వార్డు కౌన్సిలర్ పిల్లి క్లేరా భర్త పిల్లి ముసలయ్య నడిపిన కారు భీభత్సం సృష్టించింది. బ్రేక్ కు బదులు ఎక్స్ లేటర్ తొక్కడంతో నిద్రిస్తున్నవారిపై కారు దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఒక్కరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.అయితే మద్యం మత్తులో ముసలయ్య కారు నడిపాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ముసలయ్య సోషల్ వర్కర్ గా ఉండడమే కాదు టిడిపి పట్టణ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి ఓ పెళ్ళివేడుకకు హజరై రాత్రి ఒంటిగంటన్నర సమయంలో భీమవరం 38వ, వార్డు లంకపేటలోని తన నివాసానికి చేరుకొన్నాడు.
ఇంటివద్దకు చేరుకోగానే కారును ఆపి దిగే ప్రయత్నంలో బ్రేక్ కు బదులుగా ఎక్స్ లేటర్ ను ముసలయ్య తొక్కారు.దీంతో కారు వేగంగా అదే ప్రాంతంలోనే రోడ్డుపైనే మంచాలు వేసుకొని నిద్రిస్తున్నవారిపైకి దూసుకెళ్ళింది.అక్కడే ఉన్న పాడుబడిన ఇంటిని గుద్దుకొని కారు నిలిచిపోయింది.
కారు ఢీకొనడంతో తొత్తరమూడి మావుళ్ళు,గగనం మరియమ్మ, కండేలు శాంతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.అయితే మావుళ్ళు అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన మరియమ్మ, శాంతమ్మ ల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు.
మెరుగైన చికిత్స కోసం వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటనస్థలాన్ని పరిశీలించారు. మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ముసలయ్యను పోలీసులు అరెస్టు చేశారు.
మరో వైపు ముసలయ్య మద్యం మత్తులో ఉండడం వల్లే కారును అదుపు చేయలేకపోయారని స్థానికులు చెబుతున్నారు. కారు పాడుబడిన ఇంటికి ఢీకొట్టి ఆగిపోయిందని, లేకపోతే ఇంకా పెద్దఎత్తున నష్టం వాటిల్లేదని వారు చెబుతున్నారు.అయితే ఈ ఘటనపై పార్టీ నాయకులు బాధితుల కుటుంబంతో రాజీ చేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించారని సమాచారం.