నక్సల్స్ ప్రభావం తగ్గింది, మహిళలపై పెరిగాయి: డిజిపి
హైదరాబాద్: రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం తగ్గిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిజిపి) ప్రసాద రావు మంగళవారం చెప్పారు. డిజిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాదిలో 163 మంది నక్సల్స్ను అరెస్టు చేశామని, 76 మంది లొంగిపోయారని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపామన్నారు.
స్మగ్లర్లను అణిచివేసేందుకు 531 కేసులు నమోదు చేసి, 3,249 మందిని అరెస్టు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాదిలో నలభై వేలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. గతంతో పోలిస్తే 6.4 శాతం ఎక్కువ అని చెప్పారు. సైబరాబాదు పరిధిలో 3335 రోడ్డు ప్రమాదాలు సంభవించాయన్నారు.
నగరంలో భారీగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ జరిమానాలు రూ.123 కోట్లు వసూలయ్యాయన్నారు. రాష్ట్రంలో ఆందోళనల దృష్ట్యా భద్రతా చర్యలు పెంచామని, 95 కంపెనీల కేంద్ర పారామిలటరీ, 35 కంపెనీల ఎపిఎస్పీ బలగాలను మోహరించినట్లు చెప్పారు.
ఈ ఏడాది రాష్ట్రంలో కేసుల శాతం 12కు పెరిగిందని, అందులో ఎక్కువగా కిడ్నాప్ ఘటనలు ఉన్నాయని తెలిపారు. మహిళలకు సంబంధించి కేసు 15 శాతం పెరిగాయన్నారు. ఈ ఏడాది సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువగా నమోదైయ్యాయని, చోరీలు, ఆర్థిక నేరాలు పెరిగిపోయాయని, రూ.1844 కోట్ల సొత్తు చోరీ అయినట్లు చెప్పారు.
విశాఖ, హైదరాబాద్, సైబరాబాద్లలో సైబర్ నేరాలు పెరిగాయన్నారు. చిన్నారులపై అఘాయిత్యాలు జరిగాయని, వరకట్న వేధింపులు, అత్యాచారాలు ఎక్కువయ్యాయన్నారు. పోలీసు క్వార్టర్సు కోసం భారీగా నిధులను కేటాయించినట్లు ప్రసాద రావు తెలిపారు.